హైదరాబాద్: మనం పిల్లి ఎలుక, పాము ముంగీస పోట్లాడుకోవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అందరం ప్రత్యక్షంగా చూడకపోయినా మీడియాలోనో, సోషల్ మీడియాలోనో ఇలాంటి దృశ్యాలు తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ, మొసలి, కొండచిలువ మధ్య పోరాటం అనేది అత్యంత అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన పోరాటానికి సంబంధించిన చిత్రాలే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఆస్ట్రేలియా దేశం క్వీన్స్ల్యాండ్లోని ఈసా పర్వత ప్రాంతంలో కయకెర్ మార్టిన్ అనే పర్యాటకుడు ఆ అరుదైన మొసలి-కొండ చిలువ పోరాటాన్ని తన కెమెరాలో బంధించాడు. ఈసా పర్వత ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లినప్పుడు ఓ నదీ తీరంలో మొసలి, ఆలివ్ కొండచిలువ పోట్లాడుకుంటున్న దృశ్యం కయకెర్కు కనబడింది. వెంటనే ఆ దృశ్యాలను తన కెమెరాలో బంధించాడు. అయితే, ఈ రెండు జంతువుల మధ్య జరిగిన పోరాటంలో ఆలివ్ కొండచిలువదే పైచేయి అయ్యింది.
పోరాటం జరిగిన ప్రాంతంలో నీళ్లు సరిగా లేకపోవడంతో మొసలి చేతులెత్తేసింది. దాంతో ఆలివ్ కొండచిలువ ఆ మొసలిని చుట్టేసి చంపింది. ఆ తర్వాత దాన్ని అమాంతం మింగేసింది. ఈ ఫొటోలను ‘సీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ’ సంస్థ రెండేండ్ల క్రితమే తమ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. అయితే, ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారాయి. ఆ దృశ్యాలను కింది చిత్రాల్లో మీరు కూడా వీక్షించండి.