కోల్కతా: బెంగాల్లో ఓ నకిలీ వ్యాక్సినేషన్ క్యాంపు గుట్టును తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి బయటపెట్టారు. ఆ క్యాంపులో వ్యాక్సిన్ తీసుకున్న ఎంపీ మిమి చక్రవర్తికి .. కోవిన్ పోర్టల్ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. దీంతో ఆ క్యాంపు నిర్వహకుడుపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్ కార్డు తీసుకోకుండానే వ్యాక్సిన్ వేశారని కూడా ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. ఐఏఎస్ ఆఫీసర్ను అని చెప్పుకుంటున్న దేబాంజన్ దేవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనే ఆ క్యాంపును నిర్వహించాడు. ఆ క్యాంపులో సుమారు 250 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వారికి ఇచ్చిన వ్యాక్సిన్లు నకిలీవా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వ్యాక్సిన్ క్యాంపు ప్రారంభం కోసం ఎంపీ మిమి చక్రవర్తి చీఫ్ గెస్ట్గా వెళ్లారు. దేబాంజన్ దేవ్ తనను ఇన్వైట్ చేసినట్లు ఆమె చెప్పారు. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో క్యాంపును నిర్వహించినట్లు ఆ వ్యక్తి తనకు చెప్పినట్లు ఎంపీ వెల్లడించారు. ఆ క్యాంపులో ఎంపీ మిమి చక్రవర్తి.. కోవీషీల్డ్ టీకాను తీసుకున్నారు.