న్యూఢిల్లీ : లక్నోలో ఇటీవల ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ను ప్రశ్నించిన ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీరును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ తప్పుపట్టారు. అఖిలేష్, రాహుల్ గాంధీలు తరచూ చైనా, పాకిస్తాన్ల పాట పాడుతూ ఆ దేశాలకు వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదంపై రాజకీయాలు, ఎన్నికల కోణంలో మాట్లాడే వారు అఖిలేష్ అయినా, రాహుల్ అయినా కాంగ్రెస్ లేదా ఆర్జేడీ అయినా ముందు దేశం గురించి ఆలోచించాలని మంత్రి హితవు పలికారు.
దేశాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రకటనలు చేయడం తగదని, ప్రజలు చాలా తెలివైన వారని వ్యాఖ్యానించారు. దేశంలో అభద్రత సృష్టించేందుకు ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్తో లాలూచీ పడ్డారని వారు తమ ప్రయత్నాల్లో ఎన్నడూ విజయం సాధించబోరని మంత్రి పేర్కొన్నారు. పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకువెళ్లి మరీ ఉగ్రవాదులను మోదీ ప్రభుత్వం మట్టుపెడుతోందని అన్నారు.