లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో అధికారులు అలసత్వం వహిస్తే రాష్ట్ర రాజధాని లక్నోలో లాక్డౌన్ తప్పదని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి బ్రజేష్ పాధక్ సంకేతాలు పంపారు. లక్నోలో నెలకొన్న విపత్కర పరిస్థితి చక్కదిద్దేందుకు దృష్టిసారించని పక్షంలో రాజధాని నగరంలో లాక్డౌన్ విధించాల్సి వస్తుందని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖలో మంత్రి హెచ్చరించారు.
కరోనా వైరస్పై ప్రజలు ఆరోగ్య శాఖను ఫోన్లో సంప్రదిస్తున్నా ఫోన్ కాల్స్కు సమాధానం చెప్పేందుకు అధికారులు అందుబాటులో ఉండటం లేదని, కరోనా రోగుల రిపోర్ట్స్ కోసం నాలుగు నుంచి ఏడు రోజుల సమయం పడుతోందని పాధక్ పేర్కొన్నారు. అంబులెన్స్లు సకాలంలో రోగుల వద్దకు చేరుకోవడం లేదని, ఫోన్ చేసిన ఐదు నుంచి ఆరు గంటల తర్వాత అంబులెన్స్లను పంపిస్తున్నారని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. దవాఖానల్లో బెడ్ల కొరత ఉందని ఈ లోటుపాట్లను అధిగమించని పక్షంలో లక్నోలో లాక్డౌన్ తప్పదని మంత్రి స్పష్టం చేశారు.