రోడ్లపై ఎక్కడికక్కడ బారీకేడ్లు
అడిషనల్ ఎస్పీ, డీఎస్పీల పర్యవేక్షణ
జడ్చర్లటౌన్, మే 23 : జడ్చర్ల పట్టణంలోని లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పట్టణ ప్రధాన చౌరస్తాల వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ప్రధానంగా నేతాజీ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల వద్ద ఆదివారం పోలీసులు విస్త్రతంగా తనిఖీలు చేశారు. అడిషనల్ ఎస్పీ రాంకుమార్, మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ పర్యవేక్షించారు. జడ్చర్ల పట్టణ, రూరల్ సీఐలు వీరాస్వామి, శివకుమార్, ఎస్సైలు శంషొద్దీన్, జయప్రసాద్ రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. ఉదయం 10గంటల తర్వాత అనుమతి లేకుండా వచ్చిన వాహనాలను సీజ్ చేసి జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తరలించారు. పాస్లు ఉన్న వారిని మాత్రమే రోడ్లపైకి అనుమతించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్ల వద్ద రద్దీ కనిపించింది. సడలింపు తర్వాత పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ అన్ని వ్యాపార సముదాయాలను మూసివేయించారు. జడ్చర్ల పట్టణంలో పోలీసులు తీసుకున్న చర్యలతో లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగుతున్నది. అత్యవసరం అయితే తప్పా ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.