పకడ్బందీగా అమలవుతున్న లాక్డౌన్
ఉదయం పది తర్వాత బయటకొస్తే కేసులే
బాలానగర్, మే 23 : కొవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. ఈ మేరకు బాలానగర్ మండలంలో ఏఎస్సై నాగేశ్వర్రెడ్డి, ట్రైనీ ఎస్సై మధు పర్యవేక్షణలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. ఉదయం 10గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలన్న డీజీపీ ఆదేశాల మేరకు మండలవ్యాప్తంగా పోలీసులు అత్యవసర వాహనాలు మినహా మిగతా వాటిని పీఎస్లకు తరలిస్తున్నారు. ఇలా 12 రోజుల్లోనే 500 కేసులు నమోదు చేసి 100 వాహనాలు సీజ్ చేశారు.
అత్యవసర వాహనాలకే అనుమతి..
ఉదయం 10గంటల తర్వాత కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లాక్డౌన్ నుంచి వైద్యం, ఆరోగ్య, వ్యవసాయం, గ్రామ పంచాయతీ, మున్సిపల్ సిబ్బందితోపాటు మరికొన్ని సేవలకు మినహాయింపు ఇచ్చింది. వీరు తప్పా ఎవరైనా రోడ్లపైకి వస్తే వారి వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో నిబంధనలను కఠినంగా అమ లు చేస్తున్నారు పోలీసులు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. గ్రామాల్లోనూ మరింత నిఘాను పెంచినట్లు, పెట్రో మొబైల్స్ ద్వారా నిరంతరం నిఘా చేస్తున్నామన్నారు.
100 వాహనాలు సీజ్..
ఉన్నతాధికారులు లాక్డౌన్ను పక్కగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లఘించే వారిని ఉపేక్షించొద్దని ఆదేశాలు జారీ చేయడంతో మండలంలో 12 రోజుల్లో 500 కేసులు నమోదు చేసి 100 వాహనాలు సీజ్చేశారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం సిబ్బందితో వాహనాల రాకపోకలపై పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. మం డలంలోని అన్ని గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరించనున్నారు.