నవాబ్పేట, మే29: రైతులకు గన్నీబ్యాగులు సరఫరా చేయడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారని మండలంలోని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ అనంతయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐకేపీ పనితీరును ఏపీఎం రాంబాబు, వ్యవసాయ శాఖ పనితీరును ఏవో కృష్ణకిశోర్ వివరిస్తుండగా, సభ్యులంతా ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. ఎంపీపీ అనంతయ్య, ఎంపీటీసీ తుల్సీరామ్, సర్పంచులు గోపాల్గౌడ్, సత్యం, వెంకటేశ్ తదితరులు సభలో స్పందిస్తూ.. రైతులు ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తే వాటిని విక్రయించడంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం రైతుల కోసం సరిపోయినన్ని గన్నీ బ్యాగులు సరఫరా చేస్తున్నప్పటికీ వాటిని ప్రణాళికాబద్ధంగా రైతులకు చేరవేయడంలో అధికారులు విఫలమవుతున్నారన్నారు. అలాగే తాగునీటి సరఫరాను ఏఈ శమీయుల్లాఖాన్ వివరిస్తుండగా.. పలువురు సభ్యులు అభ్యంతరం తెలిపారు. మిషన్ భగీరథ పైప్లైన్ రిపేర్ కారణంగా కొన్ని గ్రామాలకు భగీరథ నీరు అందడం లేదన్నారు. అలాంటప్పుడు గ్రామాల్లో ఉన్న బోర్లను రిపేరు చేసుకునేందుకు ఏఈ బిల్లులు చేయడంలేదని వాపోయారు. అనంతరం ఎంపీపీ అనంతయ్య మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. అనంతరం వైద్యం, విద్య, ఐసీడీఎస్, అటవీ, రెవెన్యూ తదితర శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీలత, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు తాహెర్ తదితరులు పాల్గొన్నారు.