అధికారులపై డీఎంవో ఆగ్రహం
నవాబ్పేట, మే 27: నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో నెల రోజుల నుంచి టెండర్లు ఎందుకు నిర్వహించడం లేదని జిల్లా మార్కెటింగ్ అధికారి సారిక అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డును గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మార్కెట్ యార్డులో టెండర్లు వేసి ఈ సీజన్లో ఇంతవరకు ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని మార్కెట్ కార్యదర్శి శివశంకర్రెడ్డిని ప్రశ్నించారు. హమాలీల సమ్మె కారణంగా 25 రోజుల నుంచి ఇంతవరకు టెండర్లు నిర్వహించలే దని కార్యదర్శి తెలుపడంతో..డీఎంవో ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజుల నుంచి సమ్మె లేదు కదా..ఎందుకు టెండర్లు పెట్టలేదంటూ నిలదీశారు. రైతులతో వ్యాపారులు రూ.1,400నుంచి రూ.1,500 తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి..అక్కడే ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో వ్యాపారులు రూ.1,888కి విక్రయిస్తున్నట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. వ్యాపారులకు లాభం చేకూర్చడానికే టెండర్లు వేయడం లేదా అని నిలదీశారు. విషయాన్ని ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని ధాన్యాన్ని ప్రభత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో చైర్మన్ డీఎన్ రావు, కార్యదర్శి శివశంకర్రెడ్డి తదితరులు ఉన్నారు.