నారాయణపేట రూరల్, మే 25 : జిల్లా కేంద్రంలో లాన్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. ఉదయం 9:30 గంటలకే పోలీసులు, మున్సిపల్ అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లకు చేరుకుంటున్నారు. 10 గంటల తర్వాత బయట అనవసరంగా తిరిగేవారికి రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. లాన్డౌన్ నిబంధనలు అతిక్రమించి తిరుగుతున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలిస్తున్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని, లేకుంటే ఇండ్ల వద్దనే ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
ధన్వాడలో..
ధన్వాడ, మే 25 : మండలంలో లాక్డౌన్ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సై రాజేందర్, ఏఎస్సై ఆంజనేయులు, పోలీసులు మంగళవారం మండలంలో పలు వీధుల్లో తిరిగారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరించారు.
కానుకుర్తి చెక్పోస్టు తనిఖీ
దామరగిద్ద, మే 25 : కానుకుర్తి చెక్పోస్టును ఎస్సై గోవర్ధన్ పరిశీలించారు. అనంతరం లాక్డౌన్ అమలు తీరును, మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు నిర్వహించే గస్తీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలి, మాస్కు తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు. మండలంలో బ్యాంక్ కు వచ్చిన ఖాతాదారులకు భౌతిక దూరం పాటించే విధంగా అవగాహన కల్పించారు. వాహనాలను తనిఖీ చేసి నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధించారు. కార్యక్రమంలో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
పది తర్వాత దుకాణాలు తెరిస్తే చర్యలు
కృష్ణ, మే 25 : కరోనాతో జాగ్రత్తగా ఉంటూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించి పది గంటల తర్వాత షాపులు తెరిచిన, బయట తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తప్పవని ఎస్సై మురళి అన్నారు. మంగళవారం మురళి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామాల్లో ఎవరైనా నిబంధనలు అతిక్రమించి దుకాణాలు తెరిచిన, బయట తిరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.