భూత్పూర్, జూన్ 23: జర్నలిస్టులను తక్కువ చేసి మాట్లాడితే సహించేది లేదని టీయూడబ్ల్యూజే హెచ్-143 అధ్యక్షుడు గోవర్ధన్గౌడ్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ జర్నలిస్టులకు డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తే కొందరు పనిగట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం సహించరాని విషయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30ఏండ్లుగా జర్నలిజంలో ఉండి కనీసం ఇల్లు లేక పూటగడవక ఎంతో మంది జర్నలిస్టులు ఈ రంగం నుంచి వైదొలిగారని తెలిపారు. ఇన్నాళ్లకు మంత్రి శ్రీనివాస్గౌడ్ జర్నలిస్టుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే పనికిరాని సంఘాల నాయకులు మంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. జర్నలిస్టుల పక్షాన నిలబడి వారి కుటుంబాలకు ఆరోగ్య కార్డులను అందజేసిన ఘనత మంత్రిదేనని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో 102మంది జర్నలిస్టులకు ఇండ్లను మంజూరు చేసి నిర్మాణ పనులను చేస్తున్నారని తెలిపారు. జర్నలిస్టుల పొట్ట కొడితే చూస్తూ ఊరుకునేది లేదని ఘాటుగా విమర్శించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే హెచ్143 సంఘం జిల్లా నాయకులు శివకుమార్, వెంకటేశ్, రాజు, చంద్రశేఖర్గౌడ్, రమణ, విజయకుమార్ పాల్గొన్నారు.