పిడుగుపాటుకు 39 గొర్రెలు మృతి, రూ. 10లక్షలు నష్టం
కొత్తకోట, మే 12 : పిడుగుపాటుకు గురై 39 గొర్రెలు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పాలెం గ్రామంలో చోటు చేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. పాలెం గ్రామ శివారులో జీవాలను మేత మేపిన తరువాత కంచె వేసి గొర్రెలను మందగా ఉంచారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన వర్షంలో గొర్రెల మంద సమీపంలో పిడుగు పడింది. దీంతో పాలెం గ్రామానికి చెందిన జినిగె కృష్ణయ్యకు చెందిన 18 గొర్రెలు, ధర్మయ్యకు చెందిన 9 గొర్రెలు, పెద్ద సాయిలుకు చెందిన 4 గొర్రెలు, వంగూరు రాములుకు చెందిన 4 గొర్రెలు, శివయ్యకు చెందిన ఒక గొర్రె, బాలకొండయ్యకు చెందిన ఒక గొర్రె, గంగన్నకు చెందిన రెండు గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటనలో మొత్తం 39 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో దాదాపుగా రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా పశువైద్యాధికారి వెంకటేశ్వర్రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, గొర్రెల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి బుధవారం ఉదయం మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. ఆర్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలంలో వివరాలు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్ హామీ ఇచ్చారు. వీరి వెంట గాడిల ప్రశాంత్, రాధాకృష్ణారెడ్డి, మోహన్కుమార్, మల్లేశ్, అలీంఖాన్, మైబు, బాలన్న, సత్యంయాదవ్, శంకర్యాదవ్, మన్యంకొండ, జయరాములు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.