పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా
నారాయణపేట టౌన్, జూన్ 11: జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని పంచాయతీరాజ్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పంచాయతీరాజ్ ప్రత్యేక కమిషనర్ రఘునందన్రావు, అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతికుమారి, కార్యదర్శి రాకేశ్మోహన్ దొబ్రియాల్తో కలిసి వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, పీడీలు, డీఆర్డీవోలు, ఫారెస్ట్ అధికారులు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలతో 7వ విడుత హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేస్తామని, అందుకు అనుగుణంగా ఇప్పటికే జిల్లాలోని నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. ఈ ఏడాదికిగానూ మొక్కలు నాటవలసిన ప్రాంతాలైన రోడ్డు పరిసరాలు, పల్లెప్రకృతి వనాలు, రైతుల వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లు తెలిపారు. మొక్కలు నాటేందుకు వెంటనే గుంతలు తవ్వించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. గ్రామా ల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్డీవో కాళిందిని, డీపీవో మురళి, జెడ్పీ సీఈవో సిద్దిరామప్ప, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగుల పథకాలను త్వరగా అమలు చేయాలి
నారాయణపేట టౌన్, జూన్ 11: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలన్నీ త్వరితగతిన అమలు చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో దివ్యాంగుల పథకాల అమలు తీరుపై ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సీడీపీవోలతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా దివ్యాంగుల ఉపాధి పునరావాస పథకంపై సమీక్షించారు. ఈ పథకం ద్వారా జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి మున్సిపాలిటీ నుంచి ఒక దివ్యాంగుడు లబ్ధిపొందేలా నిధులు మంజూరయ్యాయని వివరించారు. ఇందులో మహిళలకు 33శాతం కేటాయించినట్లు పేర్కొన్నారు. దామరగిద్ద, ధన్వాడ, కోస్గి, మరికల్, నర్వ మండలాల నుంచి మహిళలను ఎంపిక చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. అర్హులైనవారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్ ద్వారానే ఎంపికలు నిర్వహించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారి వేణుగోపాల్రావు పాల్గొన్నారు.