నారాయణపేట, జూన్ 10 : పోలీస్స్టేషన్ల్లో రిసెప్షన్ అధికారి బాధితులపై మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని రిసెప్షన్ వర్టికల్ అధికారి రాజేందర్ అన్నారు. గురువారం జిల్లాలోని పోలీస్స్టేషన్ల రిసెప్షన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకరోజు శిక్షణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును పూర్తిగా చదివి ఆ వివరాలను పిటీషన్ మేనేజ్మెంట్ సిస్టంలో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదుల తీవ్రతను బట్టి ఎస్హెచ్వోలకు గానీ, వర్టికల్ అధికారులకు గానీ తెలియజేయాలన్నారు. రిసెప్షన్ వద్ద, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రికార్డులు, సిస్టంలను నిర్దేశిత ప్రదేశంలో, క్రమపద్ధతిలో ఉంచుకోవాలన్నారు. కొవిడ్ కారణంగా పోలీస్స్టేషన్లలో నిబంధనలు పాటించాలని, అవకాశం ఉంటే బాధితులు తమ ఫిర్యాదులను పోలీస్స్టేషన్ ఆవరణలో ఉన్న పెట్టెలో వేసేలా చూడాలన్నారు. శిక్షణలో పోలీస్స్టేషన్ల రిసెప్షన్ అధికారులు, ఐటీ కోర్ టీం పాల్గొన్నారు.