గద్వాల, మే 7: దవాఖానలో అన్ని వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని, వైద్యులు కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వైద్యులకు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్ ఫ్లోమీటర్లను ఎమ్మెల్యే గద్వాల దవాఖాన వైద్య సిబ్బందికి అందజేసి మాట్లాడారు. వైద్యులు ముందుగా కరోనా బాధితులకు ధైర్యం చెప్పాలని సూచించారు. దవాఖానలో అన్ని వసతులు ఉండేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ఏ పరికరాలైనా అందించడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే తెలిపారు. దవాఖానలో ఆక్సిజన్ కొరత లేకుండా చేశామని చెప్పారు. మందులు, బెడ్స్ కొరత లేకుండా చూసే బాధ్యత వైద్యాధికారులదేనని తెలిపారు. ఇప్పటికే దవాఖానలో కరోనా టెస్ట్ల కోసం వచ్చే వారికి దవాఖాన ఆవరణలో షెడ్డు వేయించానని చెప్పారు. కరోనా బాధితులు కోలుకొని ప్రశాంతంగా బయటకు వెళ్లేలా డాక్టర్లు వైద్యం అందించాలన్నారు. కరోనా సోకిన వారు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్కుమార్, దవాఖాన పూర్వపు సూపరింటెండెంట్ నవీన్క్రాంతి, స్టోర్ ఇన్చార్జి వెంకటస్వామి పాల్గొన్నారు.