టెంట్, తాగునీటి సౌకర్యం కల్పించాలి
కలెక్టర్ వెంకట్రావు
పీహెచ్సీ, సబ్సెంటర్ల ఆకస్మిక తనిఖీ
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 7: అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వద్ద టెంటు, తాగునీటి వసతి ఏర్పా టు చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్, పరీక్షల నిమిత్తం వచ్చి ఎండలోనే ఉండటం గమనించిన కలెక్టర్ తక్షణమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో మాట్లాడారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల వద్ద టెంట్లు, తాగునీళ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజు వ్యాక్సిన్, పరీక్షల నిమిత్తం ఎంతమంది వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.కృష్ణ ఉన్నారు.
కొత్త మండలంలో
కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
మహబూబ్నగర్, మే 7: నూతనంగా ఏర్పాటైన మహ్మదాబాద్ మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, మండల అధికారులతో వీసీలో మాట్లాడారు. మహమ్మదాబాద్ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసిందని, ఈ మేరకు ముఖ్యమైన కార్యాలయాలను మహమ్మదాబాద్ మండల కేంద్రంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తాసిల్దార్ కార్యాలయం, మండల విద్యాశాఖ, వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయాలను ఈనెల 10న ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కార్యాలయాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో మండల అవసరమైన లాగిన్, పాస్వర్డ్ కేటాయింపు, శాఖల వారీగా పోస్టులు మంజూరు చేసేందుకుగానూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. తాత్కాలికంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో తాసిల్దార్, ఎంఈవో, మండల వ్యవసాయ అధికారి కార్యాలయాలను ప్రారంభించాలని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ, ఇన్చార్జి డీఈవో అనసూయ పాల్గొన్నారు.
నవదుర్గా బిల్లెట్స్ డైరెక్టర్ సేవలు అభినందనీయం
మహబూబ్నగర్, మే 7: కరోనా నివారణకు తన వంతు సాయం అందించేందుకు ముందుకొచ్చిన నవదుర్గా బిల్లెట్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ రిశికాంత్ సేవలు అభినందనీయమని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. ఈ మేరకు రిశికాంత్ గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి కరోనా నివారణ చర్యలకుగానూ రూ. 5లక్షల విలువ గల చెక్కును కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దాతలు ముందుకొచ్చి కరోనా బాధితులకు సాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.