నారాయణపేట రూరల్, జూన్ 6: పట్టణంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంటకు పట్టణంలోని వివిధ ప్రధాన కూడళ్లలో పోలీసులు తిరుగుతూ తెరిచి ఉంచిన దుకణాలను మూయిస్తున్నారు. 2 గంటలకు వివిధ చౌరస్తాల వద్ద అనవసరంగా తిరుగుతున్న వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. రెండు రోజులుగా మధ్యాహ్నం సమయంలో చాలాచోట్ల లాక్డౌన్ ప్రారంభమైన కొద్ది సేపటికి పోలీసులు భోజనానికి వెళ్లడంతో చాలా చోట్ల చౌరస్తాల వద్ద ఎవరూ లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు అనవసరంగా బయట తిరుగుతూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అధికారులు ఈమేరకు దృష్టి సారించి లాక్డౌన్ పటిష్టంగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, జూన్ 6: మండంలోని అన్ని గ్రామాల్లో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తెరిచి అనంతరం మూసి వేస్తున్నారు. వ్యవసాయదారులు వ్యవసాయపనులకు ధాన్యం అమ్మకాలకు వెళ్లడం మినహా మిగతా జనాలు ఎవరూ బయటికి రావడం లేదు. వీటిన్నంటిని ఎస్సై గోవర్ధన్తోపాటు పోలీసులు గస్తీ తిరిగి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోగల కానుకుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న చెక్ పోస్టులో ఆశ కార్యకర్తలు వచ్చిపోయేవారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పరిశీలించారు. అనవసరంగా బయట తిరిగే వాహనదారులకు పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని వారు సూచిస్తున్నారు. ప్రజలు అనవరంగా రోడ్లపైకి రావొద్దని, అత్యవసరంగా బయ టకు వస్తే మాస్కులు ధరించాలన్నారు.