ఎస్పీ డాక్టర్ చేతన
నారాయణపేట, మే 31: ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే విత్తన వ్యాపారులపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ చేతన అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువుల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై సోమవారం జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయించే లేదా సరఫరా చేసే దళారులపై, నాసిరకం ఎరువులు క్రయ విక్రయాలు చేసే ఫర్టిలైజర్ షాపులపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. వ్యవసాయ అధికారులు ధృవీకరించిన విత్తనాలనే రైతులు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులను తీసుకొని భద్రపర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలతో నిఘా ఉంచడం ద్వారా విత్తన దందాలను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. నకలీ విత్తనాలు అమ్ముతూ మళ్లీ మళ్లీ పట్టుబడితే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారి వివరాలు తెలిస్తే పోలీస్ వాట్సాప్ కైంప్లెట్ నెంబర్ 7901400100కు లేదా 100కు డయల్ చేసి సమాచారం అందజేయాలన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్ సుధాకర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. ఎటువంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.
సడలింపు సమయంలోనే పనులు ముగించుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను జూన్ 9వరకు పొడిగించిందని, లాక్డౌన్ సడలింపు సమయం ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిర్ణయించిందని ఎస్పీ చేతన ప్రకటనలో తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనే ప్రజలు తమ పనులను ముగించుకోవాలని సూచించారు. తప్పని సరిగా మాస్కులు ధరించడంతోపాటు దుకాణాల వద్ద భౌతికదూరం పాటించాలన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ పెట్టి, ఈ చలాన్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అత్యవసర సమయంలో, మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఈ పాస్లను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.