అచ్చంపేట రూరల్, జూలై 4: ‘పల్లె ప్రగతి’తో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందని జెడ్పీటీసీ మంత్య్రానాయక్, ఎంపీపీ శాంతాభాయి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని రంగాపూర్, ఘణపూర్, బోల్గట్పల్లి, అక్కారం, సిద్దాపూర్, బొమ్మన్పల్లి, చౌటపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో పల్లెప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రంగాపూర్లో ఎంపీపీ శాంతాభాయి, జెడ్పీటీసీ మంత్య్రానాయక్, ఆర్డీవో పాండు, డీఎల్పీవో శంకర్నాయక్ రోడ్లను ఊడ్చుతూ సందడి చేశారు. గ్రామంలోని వివిధ కాలనీల్లో పర్యటించి చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతువేదిక వద్ద మొక్కలను నాటి నీరుపోశారు. పల్లెప్రగతితో గ్రామాలను అందంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. పల్లెల్లో ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపట్టాలని గుర్తు చేశారు. పారిశుధ్యం, పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రైనేజీల్లో చెత్త తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులపై ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్ లోక్యానాయక్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మధు, పంచాయతీ కార్యదర్శి శివ, అంగన్వాడీ టీచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
ముమ్మరంగా పల్లెప్రగతి
నాలుగో విడుత పల్లెప్రగతిలో భాగంగా మండలంలోని అప్పాయిపల్లి, మగ్దూంపూర్ తదితర గ్రామాల్లో పల్లెప్రగతి పనులు ఆదివారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి, అభివృద్ధి పనులను ఎంపీడీవో గీతాంజలి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గీతాంజలి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరి చేరవన్నారు. ముఖ్యంగా పల్లెప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేసి మొక్కలను విరివిగా నాటించాలన్నారు. అనంతరం ప్రధాన వీధుల గుండా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పల్లెప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచులు నీలవేణి, హన్మంతునాయక్, మాజీ డిప్యూటీ సర్పంచ్ పర్వతాలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.