ఆరు దశాబ్దాలుగా ఆర్యవైశ్యుల వినతులు.. విజ్ఞప్తులు
నాటి నుంచి ఈటల వరకు ఎవరూ పట్టించుకోలే
తాజాగా కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్
నిర్మాణాలకు ఒక్కో చోట ఎకరం స్థలం కేటాయింపు
మొదటి విడుతగా 50లక్షల చొప్పున కోటి నిధులు మంజూరు
ఉత్తర్వుల కాపీని అందజేసిన మంత్రులు హరీశ్రావు, కొప్పుల
ఆర్యవైశ్యుల హర్షాతిరేకాలు
జమ్మికుంట, హుజూరాబాద్ టౌన్/ జూన్30 :కమ్యూనిటీ హాళ్లు.. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్యుల అరవై ఏండ్ల కల! ఎన్నో అర్జీలు.. మరెన్నో విజ్ఞప్తులు. కేవీ నారాయణరెడ్డి, పరిపాటి జనార్దన్రెడ్డి, రాంచంద్రారెడ్డి, ముద్దసాని దామోదర్రెడ్డి.. మొన్నటి ఈటల రాజేందర్ వరకు ఎందరిని కలిసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఏండ్లపాటు చుట్టూ తిరిగినా లెక్కచేయలేదు. పైగా ‘షావుకార్లు మీకేంది? మీ దగ్గరే బాగా పైసలుంటయి. మీకెందుకయ్యా భూమి, బిల్డింగ్’ అంటూ ఎక్కిరించినవాళ్లే. చివరకు ఆ మాటలతో కమ్యూనిటీ భవనం గురించి మరిచిపోవాల్సి వచ్చింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరును చూస్తున్న ఆర్యవైశ్యులకు మళ్లీ నమ్మకం కలిగింది. ఇటీవల తమ విజ్ఞప్తిని స్థానిక నాయకుల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే హామీ లభించింది. ఆ వెంటే హుజూరాబాద్, జమ్మికుంటలో భవన నిర్మాణల కోసం స్థల కేటాయింపు జరిగింది. ఒక్కోచోట కోటి వ్యయంతో నిర్మించనుండగా, బుధవారం 50లక్షల చొప్పున కోటి నిధులు మంజూరు చేసింది. మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఉత్తర్వుల కాపీని అందించగా, ఆర్యవైశ్యలోకం ఆనందంలో మునిగిపోయింది. అడిగిన వెంటనే ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతా పూర్వకంగా హుజూరాబాద్లో ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసింది.
హుజూరాబాద్, జమ్మికుంటలో కమ్యూనిటీ భవనాల కోసం ఆర్యవైశ్యులు అరవై ఏండ్లుగా తిరుగుతున్నారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులకు అర్జీలు సమర్పించారు. ఎంతో మంది ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగారు. నాటి కమలాపూర్ ఎమ్మెల్యేలుగా పనిచేసిన కేవీ నారాయణరెడ్డి, పరిపాటి జనార్దన్రెడ్డి, రాంచంద్రారెడ్డి, ముద్దసాని దామోదర్రెడ్డి, ఈటల రాజేందర్ ఎన్నోసార్లు కలిశారు. కమ్యూనిటీ భవనం కోసం భూమి అడిగారు. నిర్మాణం కోసం నిధులు అడిగారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినా ఎన్నికల తర్వాత బుట్టదాఖలు చేసేవారు. ఏళ్లు గడిచినా భూమి ఇవ్వలే. ఎవరూ పట్టించుకోలే. పైగా ‘షావుకార్లు మీకేంది. మీ దగ్గరే బాగా పైసలుంటయి. మీకెందుకయ్యా భూమి, బిల్డింగ్’ అంటూ ఎద్దేవా చేశారు. నాటి ప్రజాప్రతినిధులు, నాయకుల మాటలకు కమ్యూనిటీ భవనం కావాలని అడగడమే మానేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. గుండెల్లో అడగాలని ఉన్నా అడిగితే ఏమంటారో అనే భయపడేవారు. చివరికి కమ్యూనిటీ భవన నిర్మాణం మంజూరు విషయం మరిచిపోయారు.
కలను సాకారం చేసిన సీఎం..
కమ్యూనిటీ భవనాల కోసం గతంలో ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది. ఇన్నాళ్లూ నైరాశ్యంలో మునిగిపోయిన ఆర్యవైశ్యులకు ఇప్పుడు తమ కోరిక నెరవేరుతుందన్న భరోసా కలిగింది. తమ విజ్ఞప్తిని స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. వెంటనే కమ్యూనిటీ భవనాల కోసం ప్రభుత్వ భూమిని అందించాలని సీఎం వారం క్రితం రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతే స్థానిక తహసీల్దార్, సిబ్బందితో కలిసి ఎకరం ప్రభుత్వ స్థలాన్ని చూపారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసీ క్యాంపులో ఎకరం, జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కోరపల్లి రోడ్డులో ఎకరం స్థలం కేటాయించారు. ఒక్కో చోట కోటితో భవనం నిర్మించాలని నిర్ణయించారు. బుధవారం కమ్యూనిటీ హాల్స్ కోసం ఎకరం చొప్పున ప్రభుత్వ భూమి కేటాయించిన ప్రభుత్వం, మొదటి విడుతగా ఒక్కో భవన నిర్మాణానికి 50లక్షల చొప్పున కోటి మంజూరు చేసింది. హుజూరాబాద్, జమ్మికుంట ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులకు మంత్రి హరీశ్రావు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సిద్ధిపేటకు పిలిపించారు. రెండు సంఘాలకు కేటాయించిన నిధులకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని హరీశ్రావుతోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కోలేటి దామోదర్ చేతుల మీదుగా అందజేశారు.
హర్షాతిరేకాలు..
హుజూరాబాద్, జమ్మికుంటలో వైశ్య భవనాలకు ఎకరం స్థలం కేటాయించడంతోపాటు 50 లక్షల చొప్పున సర్కారు నిధులు మంజూరు చేయడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు తమను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, అడుగగానే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, గంగుల కమలాకర్ ఆర్యవైశ్య భవన్ నిర్మాణాలకు కోటి నిధులు, ఎకరం స్థలం కేటాయించారంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్యులు మంగళవారం జమ్మికుంట రోడ్డు వాసవీ కన్యాక పరమేశ్వరీ ఆలయం వద్ద మహత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి హుజూరాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక-శ్రీనివాస్, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, చందాగాంధీ, టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గందె సాయి, చొల్లేటి రాజన్న, అకినపల్లి అనిల్, పుల్లూరి శ్రీకాంత్, కొమురవెల్లి రఘువీరు, రాజన్న, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులను ఎవరూ పట్టించుకోలె..
కమ్యూనిటీ భవనాల కోసం ఆర్యవైశ్యులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎవరూ పట్టించుకోలేదు. కనీసం గుర్తించలేదు. కానీ, సీఎం కేసీఆర్ మా ఆర్యవైశ్యులను ప్రత్యేకంగా గుర్తించారు. అడిగిన వెంటనే పెద్దమనసుతో ఆర్యవైశ్య భవనాలకు ఎకరం స్థలంతోపాటు 50లక్షల చొప్పున మంజూరు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటాం.
50వేలు కట్టినా ఇయ్యలె..
ఏం జెప్పాలే మా బాధ. దామోదర్రెడ్డి హయాంలో అడిగినం. తిరిగినం. ప్రభుత్వ భూమి చూపినట్టే జేసిన్రు. ఆ భూమికి పైసలు కట్టమన్నరు. మేమే తయారు జేసుకుని 30ఏళ్ల కిందట్నే 50వేలు కట్టినం. పైసలు పోయినయి. భూమి రాలే. కొందరు ప్రజాప్రతినిధులు మాకు రాకుండా జేసిన్రు. ఏ నాయకుడైనా మమ్మల్ని చిన్నచూపే చూసిండు. కేవలం ఒక్క కమ్యూనిటీ భవనం కోసం ఇన్నేళ్లు తిరగాలా..? ఏటా రాములోరి కల్యాణానికి లక్షలకు లక్షలిస్తున్నం. అన్నం బెడుతున్నం. చెప్పుకోవడం కాదు గానీ, మేం ఇంతజేసినా మాకు అన్యాయమే జరిగింది. ఇన్నాళ్ల్లు ఎవరూ పట్టించుకోలే. ఇప్పటికైనా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది. ఎకరం భూమి ఇచ్చిన్రు. 50లక్షలు మంజూరు జేసిన్రు. సంతోషంగా ఉంది.