మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనుల ప్రారంభం
స్థానికుల హర్షం
సీసీసీ నస్పూర్, జూన్ 23 : పట్టణాల్లో రవాణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో బుధవారం స్థానిక కౌన్సిలర్ జబిన్హైమద్, చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్తో కలిసి ఆయన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ముందుగా కాకతీయ హిల్స్లో రూ.5 లక్షల సీఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్డు, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గల జాతీయ రహదారిపై ఎన్హెచ్ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ (ఎఫ్డీఆర్) కింద మంజూరైన రూ.1.18 కోట్లతో కల్వర్టు పనులకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నస్పూర్ మున్సిపాలిటీలో రోడ్డులేని వాడ ఉండకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద లో లెవల్ డ్రైనేజీ వల్ల వానకాలంలో వరదనీరు నిండుకొని వాహనదారులు, స్థానికులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు.
జాతీయ రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న కల్వర్టుతో సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. వానకాలం వచ్చిందంటే షాపుల యజమానులు గజగజ వణికిపోయేవారని, తీవ్రంగా నష్టపోయేవారని పేర్కొన్నారు. అలాగే రాకపోకలకు తీవ్ర అం తరాయం కలిగేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాము ఎల్లవేళలా ముందుంటామని స్పష్టం చేశారు. కల్వర్టు నిర్మాణంతో ఏళ్లనా టి సమస్య పరిష్కారమవుతుండడం ఆనందంగా ఉందన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం తమ సమస్య పరిష్కారం కాబోతుండడంతో హర్షం వ్యక్తం చేస్తూ స్థానికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజలింగు, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, పూదరి కుమార్, బెడికె లక్ష్మి, చిడం మహేశ్, కో ఆప్షన్ సభ్యుడు నాసర్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, నాయకులు ఎండీ హైమద్, కమలాకర్రావు, ఏనుగు రవీందర్రెడ్డి, అన్నయ్య, ఎర్రయ్య, గర్శె భీమయ్య, మల్లెత్తుల రాజేంద్రపాణి, రాచకొండ గోపాల్రావు, అక్కూరి సుబ్బయ్య, జాడి భానుచందర్, వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, దగ్గుల మధు, తదితరులు పాల్గొన్నారు.