రైతు సమస్యల పరిష్కారానికి టోల్ఫ్రీ నంబర్లు
1800 200 1001
040-3367 1300
హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ పెట్టుబడి కోసం ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు డబ్బులను పాత బాకీల కింద జమచేసుకోకుండా నేరుగా రైతులకు ఇవ్వాలని బ్యాంకర్లకు ఆర్థికమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. వానకాలం సాగుకు పెట్టుబడిగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తే, కొన్ని బ్యాంకులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి కే రామకృష్ణారావుతో కలిసి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధులను పాత బాకీల కింద జమ చేసుకోవాలన్న సూచనలేమీ జారీ చేయలేదని బ్యాంకర్లు మంత్రికి తెలిపారు. రైతుబంధు నిధులను ఎట్టి పరిస్థితుల్లో బాకీల కింద జమచేసుకోవద్దని, ఇప్పటికే బాకీల కింద సర్దుబాటు చేసిన మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాలో జమ చేయాలని, బ్యాంకు శాఖలకు కచ్చితమైన ఆదేశాలు జారీచేయాలని బ్యాంకర్ల కమిటీకి మంత్రి సూచించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతుబంధు డబ్బును జమచేసుకునే అధికారం బ్యాంకులకు లేదని హరీశ్రావు స్పష్టంచేశారు. అది రైతుల డబ్బుకాదని, రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం వేస్తున్న డబ్బు అని చెప్పారు. రైతు విత్డ్రా చేసుకున్న తర్వాతే అది రైతు సొమ్ము అవుతుందని స్పష్టం చేశారు. క్లాజులు, నిబంధనల పేరుతో బ్యాంకర్లు ఇలానే వ్యవహరిస్తే రైతులకు రైతుబంధు సొమ్మును బ్యాంకుల ద్వారా కాకుండా.. నేరుగా నగదు రూపంలో ఇస్తామని తేల్చి చెప్పారు. దీనితో దిగొచ్చిన బ్యాంకర్లు.. రైతుబంధు సొమ్మును పాత బాకీల కింద జమకాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయా బ్యాంకులు తమ శాఖలకు సర్క్యులర్లు కూడా జారీచేశాయి. పాత బాకీల కింద రైతుబంధు సొమ్మును సర్దుబాటు చేయటాన్ని ఆర్థికమంత్రి హరీశ్రావు తీవ్రంగా పరిగణించారని అందులో పేర్కొన్నాయి. రైతుబంధు సొమ్మును నిలిపివేత లేదా సర్దుబాటు చేయొద్దని ప్రభుత్వం సూచించిందని తెలిపాయి. ఇప్పటికే సర్దుబాటు చేసి ఉన్నట్టయితే వెంటనే ఆ మొత్తాన్ని తిరిగి సంబంధిత రైతుల ఖాతాలో జమచేయాలని సూచించిందని పేర్కొన్నాయి. ఈ మేరకు సంబంధిత బ్యాంకు శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి.
రైతు సమస్యలపై రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ
రైతుల సమస్యలపై రాష్ట్రస్థాయిలో ఉన్నతస్థాయి బృందం మానిటరింగ్ చేస్తుందని మంత్రి హరీశ్రావు చెప్పారు. బ్యాంకులు పంట రుణాల రెన్యూవల్, పంపిణీని వేగవంతం చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రెండు టోల్ ఫ్రీ నంబర్లు 18002001001, 040-33671300 ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఎస్బీఐ డీజీఎం నటరాజన్, బ్యాంక్ ఆఫ్ బరోడా జీఎం మన్మోహన్గుప్తా, ఎస్సెల్బీసీ డీజీఎం శేష్కుమార్ ఆది రాజు, యూబీఐ డీజీఎం షేక్ హుస్సేన్, కెనరా బ్యాంక్ డీజీఎం వేణుగోపాల్, టెస్కాబ్ ఎండీ డాక్టర్ మురళీధర్, ఐవోబీ ఏజీఎం ఆర్వీ శారద, ఏపీజీవీబి జీఎం పార్థసారథి, టీజీబీ జీఎం సతీశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.