బెంగళూరు : మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నేత హెచ్డీ దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్ (నైస్) లిమిటెడ్కు రూ.2కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 20211, జూన్లో కన్నడ వార్తా చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవెగౌడ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సంస్థ తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ పరువు నష్టం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన సివిల్ కోర్టు న్యాయమూర్తి మల్లన గౌడ రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. దేవేగౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు.
ఇదే కేసులో గతంలో ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై రూ.10కోట్ల నష్ట పరిహారం కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం.. విచారణ జరిపింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 88 ఏళ్ల దేవెగౌడ దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. 1996 నుంచి 1997 మధ్య ఆయన దేశ ప్రధానిగా చేశారు. అంతకు ముందు 1994-96లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన కుమారుడు కుమారస్వామి సైతం కర్ణాటక సీఎంగా పని చేశారు.