నారాయణపేట టౌన్, జూన్ 21 : జిల్లాలో శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వెంటనే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని సర్పంచులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశానవాటికల పనులు అసంపూర్తిగా ఉండరాదని పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే సత్వరమే పరిష్కరించుకోవాలని, పనులకు ఆటంకం కలిగించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన చెప్పారు. జిల్లాలో 8 గ్రామపంచాయతీల్లో శ్మశానవాటికల పనులు అసంపూర్తిగా ఉన్నాయని, వారం రోజుల్లో పూర్తి చేయకుంటే చర్యలు తప్పవన్నారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీవో మురళి, పీఆర్ఈఈ నరేందర్, డీఆర్డీవో గోపాల్నాయక్, డీఈలు, ఏఈలు, పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు పాల్గొన్నారు.