న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనాకు వ్యతిరేకంగా రెండు డోసుల టీకా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మే నెలలో రాహుల్ గాంధీ వైరస్ బారినపడినందున ఇంకా టీకాలు తీసుకోలేదని పేర్కొంది. మే 16న రాహుల్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉండగా.. ఒక రోజు ముందు కరోనా పాజిటివ్గా పరీక్షించారని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు తెలిపారు. సోనియా గాంధీ మాత్రం తన రెండో మోతాదులను తీసుకున్నారని చెప్పారు.
రాహుల్ నిర్ణీత గడువు ముగిసిన తర్వాత టీకా తీసుకుంటారని పేర్కొన్నారు. కరోనా వైరస్కు పాజిటివ్గా పరీక్షించిన వారు పూర్తిగా కోలుకున్న మూడు నెలల తర్వాత టీకా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇటీవల బీజేపీ నేతలు సోనియా, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు టీకా తీసుకున్నారా? అని ప్రశ్నించడంతో ఈ మేరకు కాంగ్రెస్ ఈ ప్రకటన చేసింది.