సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): నగరంలో ఉంటున్న మహిళలకే కాదు..విదేశాల్లో ఉంటున్న మన ఆడపడుచులకు భరోసా ఇస్తున్నారు షీటీమ్స్ పోలీసులు. విదేశాల్లో ఉంటూ ఎవరికి చెప్పుకోవాలో..ఎలా చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారు నగరంలోని షీటీమ్స్లకు ఫిర్యాదు చేయగా, సమస్యలను పరిష్కరిస్తూ అండగా ఉంటున్నాయి. వచ్చే ఫిర్యాదులను చాకచక్యంగా పరిష్కరిస్తున్నాయి. హైదరాబాద్ షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష నేతృత్వంలోని బృందాలు కేసుల పెండిన్సీ లేకుండా ఇతర దేశాలు, ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో వాటి తీవ్రతను బట్టి వెంటవెంటనే పరిష్కరిస్తున్నాయి. కొవిడ్ సమయంలో కూడా ఈ బృందాలు నిరంతరం పనిచేస్తూ మహిళకు బాసటగా నిలుస్తున్నాయి.
మహిళల భద్రత కోసమే రాష్ట్ర ప్రభుత్వం షీ టీమ్స్ తీసుకొచ్చింది. షీ టీమ్స్ను ఆశ్రయించే ఆపదలో ఉండే మహిళలకు సంబంధించి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇక్కడే కాదు..విదేశాల నుంచి వచ్చే ఫిర్యాదులపై మా బృందాలు స్పందిస్తున్నాయి. సమస్య పరిష్కరించాలనే ఆలోచన ఉంటే ఎలాగైన పరిష్కారమవుతుంది. భయపడకుండా షీ టీమ్స్ను ఆశ్రయించండి. మీ కోసం మేమున్నాము. -శిఖాగోయెల్, అదనపు డీజీ