ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల హవా నడుస్తుంది. మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి లాంటి బడా ఫ్యామిలీస్ నుంచి ఎందరో నటీనటులు కెమెరా ముందుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అనే ఆసక్తి అభిమానులలో ఎప్పటి నుండో ఉంది. గత కొన్నేళ్లుగా దీనిపై సస్పెన్స్ నెలకొని ఉండగా, బాలకృష్ణ తన బర్త్ డే రోజు కుమారుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.
ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య ..గతంలో నేను నటించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేయనున్నాను. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఉంటుంది. ఇందులో ఇద్దరం కలిసి నటిస్తాము. అవకాశం ఉంటే ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహిస్తాను అని బాలయ్య స్పష్టం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్.. తాతమ్మకల అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఫస్ట్ మూవీ కోసం అన్ని మెళుకువలు నేర్పిస్తానని బాలకృష్ణ తెలిపారు. బాలయ్య నోటి నుండి ఆయన తనయుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.