మంత్రివర్గ సమావేశంలో సీఎం నిర్ణయం l15 రోజుల్లో పంపిణీకి ఆదేశాలు
రంగంలోకి జిల్లా అధికారులు
ఉమ్మడి జిల్లాలో 73,815 దరఖాస్తులు
ఇప్పటికే పలు అర్జీలకు ఆమోదం
వివిధ స్థాయిలో మరికొన్ని.. పరిశీలన పూర్తయితే వేలాది మందికి లబ్ధి
పేదల్లో హర్షాతిరేకాలు
కార్పొరేషన్, జూన్ 9:ప్రజా సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పేదలకు మరో తీపి కబురు అందించారు. ఇన్నాళ్లూ వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే 15 రోజుల్లో కార్డులు పంపిణీ చేయాలని మంగళవారం జరిగిన మంత్రివర్గ మీటింగ్లో ఆదేశాలు జారీ చేయగా, అప్పుడే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లాలో 73,815 దరఖాస్తులు రాగా, అర్హుల జాబితాను సిద్ధంచేసే పనిలో పడింది. ఇప్పటికే దాదాపు పలుస్థాయిల్లో 31,160 అర్జీలకు ఆమోదం రాగా, మిగిలిన వాటిని పరిశీలించే పనిలో నిమగ్నమైంది.
రేషన్ కార్డుల మంజూరుకు లైన్ క్లియరైంది. ఇన్నిరోజులు పలు కారణాలతో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న కొత్త కార్డుల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పేదల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు కార్డులున్నాయి. వీరికి ప్రతి నెలా బియ్యం పంపిణీ చేస్తూ ఆకలి తీరుస్తున్నది. ఆహారభద్రత కార్డు కింద బియ్యం పంపిణీ చేస్తుండగా, పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు కూడా ఆమోదం ఇవ్వనుండడంతో వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే రెవెన్యూ అధికారుల వద్ద దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ 15 రోజుల్లోగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలని మంత్రివర్గం ఆదేశించడంతో అధికారులు చర్యలు ప్రారంభించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 9,65,612 రేషన్కార్డులు ఉండగా, ఇందులో 28,33,979 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికి ప్రతి నెల రేషన్ బియ్యం అందిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వం పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తూ వస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం పెద్ద సంఖ్యలోనే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు పెండింగ్ దరఖాస్తులన్నింటిని పరిశీలించి అర్హులకు త్వరలోనే రేషన్కార్డులను అందించేందుకు చర్యలు మొదలుకానున్నాయి.
కరీంనగర్లో 26 వేల దరఖాస్తులు..
కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 2,73,552 ఆహారభద్రత కార్డులు ఉండగా, ఇందులో 8,11,559 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న కార్డుల తోడుగా కొత్తగా 26,189 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 440 దరఖాస్తులను అధికారులు తిరస్కరించగా, 11,212 దరఖాస్తులను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే ఆమోదించారు. ఇంకా మిగిలిన వాటిల్లో 7428 దరఖాస్తులు సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఆమోదం కోసం పెండింగ్లో ఉండగా, 6946 అర్జీలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల స్థాయిలో పెండింగ్లో ఉండగా, 163 దరఖాస్తులు తహసీల్దార్ల పరిశీలనలో ఉన్నాయి. కాగా, ఇందులో సివిల్ సప్లయ్ వద్ద ఉన్న 7428 వెంటనే ఆమోదం పొందే అవకాశం ఉండగా, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగుల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులు కూడా పరిశీలన పూర్తిచేసుకుంటే మొత్తంగా 25 వేల కార్డులకు ఆమోదం పొందే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో 20వేల దరఖాస్తులు..
జిల్లాలోని 13 మండలాల్లో 2,15,914 రేషన్ కార్డులు ఉండగా, 6,29,381మంది లబ్ధిదారులు ఉన్నారు. వీటికి తోడు కొత్తగా 20,485 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 3157 దరఖాస్తులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వద్ద, 378 తహసీల్దార్, ఏఎస్వోల దగ్గర, డీఎస్వోల దగ్గర 8,112 పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే 7,755 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. ఇందులో వివిధ కారణాలతో 1083 దరఖాస్తులు తిరస్కరించగా, అన్నిస్థాయిల్లో ప్రక్రియ పూర్తయితే మరో 10 నుంచి 15వేల కొత్త కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,237 దరఖాస్తులు
జిల్లాలోని 13 మండలాల్లో ఇప్పటికే రేషన్ కార్డులు 1లక్షా 73వేల 65 ఉండగా, 5లక్షల 5వేల 476 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే వివిధ రాష్ర్టాలకు ఉపాధి కోసం వెళ్లి, తిరిగి వచ్చినవారు, కొత్తగా పెండ్లి అయినవారు 3,237 మంది దాకా కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో డీఎస్వో కార్యాలయంలో 2,050 దరఖాస్తుల పరిశీలన పూర్తికాగా, 1,008 రెవెన్యూ కార్యదర్శి, 179 తహసీల్దార్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. కొత్త కార్డులే కాదు పాతవాటిలో మార్పులు చేర్పుల కోసం 10,825 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
కార్డులు వస్తే ఎంతో సంతోషం..
చాలా రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నాం. కానీ, అధికారులు ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడంతో కార్డులు వస్తాయన్న నమ్మకం ఉంది. కరోనా కాలంలో సీఎం కేసీఆర్ మరింత మందికి అండగా నిలిచేందుకు కొత్త కార్డులు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. సరియైన సమయంలోనే ఈ ప్రభుత్వం కార్డులను మంజూరు చేస్తుంది.