లక్నో : రోజులు మారుతున్నా దళితులపై పెత్తందారుల ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తన పెండ్లి వేడుకల్లో భాగంగా గుర్రంపై ఊరేగవద్దని గ్రామస్తులు కొందరు తనను హెచ్చరించారని యూపీలోని మహోబా గ్రామానికి చెందిన దళిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. స్థానికుల హెచ్చరికల నేపథ్యంలో తనకు పోలీస్ భద్రత కల్పించాలని కాబోయే పెండ్లికుమారుడు అలఖ్ రాం పోలీసులను కోరాడు. పెండ్లి ఊరేగింపులో గుర్రంపై ప్రదర్శనగా వెళితే చంపేస్తామని వారు బెదిరించారని అలఖ్ రాం చెప్పాడు.
తమ గ్రామంలో ఎన్నో ఏండ్లుగా పెండ్లిండ్లలో గుర్రంపై ఊరేగడం ఆనవాయితీగా వస్తోందని అయితే తన పెండ్లికి ఇలా చేస్తే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. పోలీసుల సాయం తీసుకుని గుర్రంపై ఊరేగినా తర్వాత తమ కుమారుడిని చంపేస్తామని ఇతర కులాల వారు బెదిరిస్తున్నారని బాధితుడి తండ్రి గయాదిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 18న తన కుమారుడి పెండ్లి ఊరేగింపుకు అన్ని ఏర్పాట్లు చేస్తుండగా ఈ బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని మహోబ్ గంజ్ ఎస్ఐ ప్రభాకర్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. మరోవైపు దళిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటామని ప్రకటించింది. దళిత యువకుడి పెండ్లి ఊరేగింపుకు తాను దగ్గరుండి ఏర్పాట్లు జరిపిస్తానని యూపీ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి నిర్ధోష్ దీక్షిత్ పేర్కొన్నారు.