న్యూఢిల్లీ, జూన్ 3: కరోనా కరాళనృత్యంతో ఎంతోమంది చిన్నారులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) సుప్రీంకోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకర్ని కోల్పోయిన చిన్నారుల సంఖ్య 9,346 (తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయినవారు 1,700 మంది) గా ఉన్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో వీరి సంరక్షణపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. కరోనా వల్ల ప్రభావితమైన చిన్నారుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రావ్ు మోహన్ మిశ్రా బుధవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ కింది మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన పిల్లల సంరక్షణ బాధ్యతను ఆయా జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. జువెనైల్ జస్టిస్ యాక్ట్-2015 ప్రకారం, అలాంటి చిన్నారులకు వసతి కల్పించేలా కలెక్టర్లు కృషి చేయాలి.
కుటుంబ ఆస్తులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులపై పిల్లలకు ఉన్న హక్కులను రక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ఆ ఆస్తులను అమ్మడం లేదా ఆక్రమణకు గురికాకుండా కాపాడాలి.
అనాథలుగా మారిన పిల్లలు అక్రమ రవాణాకు గురికాకుండా, చట్ట విరుద్ధమైన దత్తత ప్రక్రియలు, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మారకుండా పోలీస్ విభాగం అప్రమత్తంగా ఉండాలి.
దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగులకు ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వారి పిల్లల బాధ్యతను చూసుకునే నమ్మకస్తుల వివరాలను విధిగా తీసుకోవాలి. ఇందుకు దవాఖానలో చేరిక సమయంలో నమోదు చేసుకునే వివరాల్లో నమ్మకస్తుల పేర్లనూ నమోదు చేయాలి.