వ్యవసాయ యూనివర్సిటీ మే 23: ఇంటిముందు, పెరట్లో అశ్వగంధం వంటి ఔషధ మొక్కల పెంపకంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ఆక్సిజన్ను అధికంగా ఇవ్వడంతోపాటు, మొక్క వేర్లను పౌడర్గా చేసి సేవించడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉండటంతో పల్లె, పట్టణాలనే తేడా లేకుండా వీటికి ఆదరణ పెరుగుతున్నది. తెలంగాణతోపాటు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాల నుంచి వచ్చి మొక్కలను కొనుగోలు చేస్తున్నారని వ్యవసాయ వర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త, డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ చిన్నానాయక్ తెలిపారు. డిమాండ్ను ఆసరా చేసుకుని కొందరు దళారులు నాణ్యతలేని మొక్కలు, విత్తనాలు విక్రయిస్తున్నారని.. వారిని ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం అధికారికంగా విక్రయించే చోటనే కొనుగోలు చేయాలని సూచించారు. రాజేంద్రనగర్ నర్సరీలో ప్రస్తుతం 100 రకాల మొక్కలు, విత్తనాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈసారి క్రాప్ మ్యూజియం పేర ఎంట్రన్స్లోనే ప్రత్యేక నారుమడులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆసక్తిగలవారు ఎంపిక చేసుకున్న మొక్కలను నర్సరీ నుంచి పంపిణీ చేస్తామన్నారు.