బీజింగ్ : ప్రతికూల వాతావరణం కారణంగా మారథాన్లో పాల్గొన్న 20 మంది రన్నర్లు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు. చైనాలోని గన్సు ప్రావిన్స్కు వాయవ్యంగా ఉన్న బైయిన్ సిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. బైయిన్ నగరానికి సమీపంలోని యల్లో రివర్ స్టోన్ అటవీ ప్రాంతంలో కొండలపై 100 కిలోమీటర్ల పర్వత మారథాన్ నిర్వహించారు. ఇందులో సుమారు 172 మందికిపైగా పాల్గొన్నారు.
పరుగు కొనసాగుతుండగా 20 నుంచి 31 కిలోమీటర్ల మధ్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారి వడగళ్లు, మంచు వర్షం, భీకర చలిగాలులు సంభవించడంతో ఉష్ణోగ్రత్త ఒక్కసారిగా పడిపోయి 20 మంది ప్రాణాలు కోయినట్లు బైయిన్ నగర మేయర్ జాంగ్ జిచెన్ తెలిపారు. అప్రమత్తమైన నిర్వాహకులు 3 గంటల సమయంలో మారథాన్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి వెంటనే స్థానికుల సాయంతో సహాయక బృందాలను రంగంలోకి దించాయి.
గాయపడిన 8 మంది రన్నర్లను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు సంభవించడంతో మారథాన్లో పాల్గొన్న పలువురు రన్నర్లు హైపోథెర్మియా (అల్పఉష్ణస్థితి)తో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. మారథాన్లో పాల్గొన్న వారిలో 151 మంది సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.