న్యూయార్క్ : కరోనా వ్యాక్సిన్ల తయారీతో అధిక లాభాలను ఆర్జిస్తూ ప్రపంచంలో కొత్తగా తొమ్మిది మంది నూతన ఫార్మా బిలియనీర్లు ముందుకొచ్చారు. వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మోడెర్నా, బయో ఎన్ టెక్ సీఈఓలు రూ 28,000 కోట్ల సంపదతో ఫార్మా బిలియనీర్ల జాబితాలో దూసుకుపోయారు. ఇద్దరు మోడెర్నా వ్యవస్థాపక ఇన్వెస్టర్లు, కంపెనీ అధిపతితో పాటు కంపెనీ సీఈఓ సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
చైనా వ్యాక్సిన్ కంపెనీ కన్సినో బయలాజిక్స్ సహ వ్యవస్ధాపకులు ముగ్గురు కూడా వ్యాక్సిన్ తయారీ, అమ్మకాలతో అనతికాలంలోనే శ్రీమంతులై ఫార్మా బిలియనీర్లుగా ఎదిగారు. ఇక తొమ్మిది మంది వ్యాక్సిన్ తయారీదారులు బిలియనీర్లుగా ఎదగడంతో వారి ఉమ్మడి సంపదతో పేద దేశాల ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ చేపట్టవచ్చని పీపుల్స్ వ్యాక్సిన్ అలయన్స్ పేర్కొంది.
వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యానికి తెరపడని పక్షంలో వ్యాక్సిన్ సరఫరాలు, ధరలపై ఫార్మా కార్పొరేషన్ల నియంత్రణ పెరిగి పేద దేశాలకు వ్యాక్సిన్ల నిల్వలు అందడం కష్టమవుతుందని అలయన్స్ హెచ్చరించింది. మరోవైపు వ్యాక్సిన్లపై గుత్తాధిపత్యాన్ని నివారించి సరఫరాలు పెంచే చర్యలను జర్మనీ, బ్రిటన్ సహా జీ 20 కీలక దేశాలు అడ్డుకుంటున్నాయని అలయన్స్ ఆరోపించింది.