హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి తప్పుడు మాటలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కరోనాపై అలుపెరగని పోరాటంచేస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కన్నెర్రజేస్తున్నారు. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మంచి చేస్తున్నవారిపై బట్ట కాల్చి మీదేసే కుట్రపన్నుతున్నారని మండిప డుతున్నారు. ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. ఉన్నత పదవిలో ఉం డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శిస్తున్నారు. రెండ్రోజుల కిందట ఓ మీడియా సమావేశం లో ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రం కేటాయించిన వెంటిలేటర్స్ను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదంటూ తప్పుడు ఆరోపణలు చేశారని విమర్శించారు. వాస్తవంగా కేంద్రం కేటాయించిన వెంటిలేటర్స్ నాసిరకమనే ఆరోపణలున్నాయి. అవి పూర్తిస్థాయిలో పనిచేయడంలేదని వైద్య నిపుణులే చెప్తున్నారు.
ఈ వెంటిలేటర్లపై ఒక్క తెలంగాణే కాదు.. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్తోపాటు పలు రాష్ర్టాలు కూడా ఫిర్యాదు చేశాయి. పంజాబ్లోని బాబా ఫరీద్ వర్సిటీకి 82 వెంటిలేటర్లను పంపిస్తే అం దులో 62 పనిచేయడంలేదని ఆ వర్సిటీ వీసీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఔరంగాబాద్ మెడికల్ కాలేజీకి అందించిన అన్ని వెంటిలేటర్లు నాసిరకమని అక్కడ కమిటీ తేల్చినట్టు తెలిసింది. ఇంతటి విపత్తులో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లు 1400 మాత్రమే. వీటిని అవసరానికి అనుగుణంగా ప్రభుత్వం ఆయా దవాఖానలకు సరఫరా చేసింది. వీటిలో 100 వరకు పనిచేయడంలేదని తెలంగాణ వైద్యశాఖ అధికారులు తెలిపారు. వాటిని రిపేర్ చేయించాలంటే నిపుణులు ఇతర ప్రాంతాలనుంచి రావాల్సి ఉంటుందని, అం దుకే పక్కకు పెట్టినట్టు పేర్కొన్నారు. విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా కేంద్ర మంత్రి పనికిరాని వెంటిలేటర్లను ముందేసుకొని.. వాటిని ఫొటోలు తీయించి, విష ప్రచారం చేయిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన వెంటిలేటర్లపై అనేక రాష్ర్టాలు ఫిర్యాదుచేసిన విషయం.. మీకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసి తెలంగాణపై నీలాపనిందలు వేయడం మీకు భావ్యమేనా? ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయా ఆరోపణలు మీకు సమంజసమేనా? అని మండిపడ్డారు. తెలంగాణలో కరోనా కేసులను, మరణాలను దాస్తున్నారని తనకు సమాచారం వచ్చిదం టూ తప్పుడు ఆరోపణలు చేశారని ఫైరయ్యారు. ఒకవేళ కేసులు, మరణాలను దాస్తే పరిస్థితి ఇలా ఉండేదే నా? కట్టడి సాధ్యమయ్యేదేనా? అని నిలదీస్తున్నారు.
అన్యాయం జరుగుతున్నా.. నోరు విప్పరే
కరోనాపై తెలంగాణ ప్రభుత్వం ఒంటరి పోరాటమే చేస్తున్నది. వైరస్ కట్టడికి మొక్కవోని దీక్షతో పనిచేస్తున్నది. అందుకే ఇప్పుడు దేశంలో కరోనా కట్టడిలో తె లంగాణ మేటిగా నిలిచింది. ఈ సందర్భంలో కేంద్రంనుంచి ఆశించిన సహకారం అందడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిగురించి కిషన్రెడ్డికి తెలియంది కాదు, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకొన్నారు. ఏపీకి 4,960 వెంటిలేటర్లు కేటాయిస్తే.. తెలంగాణకు 1400 ఇచ్చినట్టు తెలిపారు. ఆక్సిజన్, రెమ్డెసివిర్ కేటాయింపుల్లోనూ రాష్ర్టానికి అన్యాయమే జరుగుతున్నది. అయినా కిషన్రెడ్డి మౌనంగానే ఉన్నారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నా రు. తెలంగాణలోని దవాఖానలు రాష్ట్ర ప్రజలకే కాదు, 4-5 రాష్ర్టాల రోగులకు సేవలు అందిస్తున్నాయి. ఇక్క డి కరోనా రోగుల్లో 40-45 శాతం రోగులు ఇతర రా ష్ర్టాలవారే ఉన్నారు. తెలంగాణకు ఇతర రాష్ర్టాల ప్రజ లు వస్తున్నారనే కనీస సోయి లేకుండా అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయింపులు పెంచకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం కేటాయించిన వనరులను ఇతర రాష్ర్టాలవారికి ఉపయోగించడం వల్ల స్థానిక ప్రజలకు కనీసం బెడ్లు దొరికే పరిస్థితిలేదని వాపోయారు. ఈ విషయం తెలిసిన కిషన్రెడ్డి.. మౌనంగానే ఉండ టం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్లను నిలువరిస్తే మాత్రం కేంద్రమంత్రి హోదాలో తెలంగాణ సీఎస్కు ఆదేశాలు జారీచేశారు. కేటాయింపుల సమయంలో గుర్తుకు రాని ఆ హోదా.. అంబులెన్స్లను ఆపితే గుర్తుకురావడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. కిషన్రెడ్డి బాధ్యతను మరిచి వ్యవహరిస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం బాధ్యతకు మించి వ్యవహరిస్తున్నారని, అన్ని పనులు ఆయనే చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఇబ్బందులను కేం ద్రానికి వివరిస్తూ కొంత ఎక్కువ కేటాయింపులు అ య్యేలా చొరవ తీసుకుంటున్నారని చెప్పారు.
కేంద్ర మంత్రిగా ఉండి ఏం లాభం?
కరోనా విపత్తును కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తున్నది. రాష్ర్టాలకు అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్ కేటాయింపులు.. చివరికి మాస్కులు, పీపీఈ కిట్లు కూడా ఆ శాఖ ఆధ్వర్యంలోనే పంపిణీ జరుగుతున్నది. ఇలాంటి సందర్భంలో స్వయంగా ఆ శాఖకు సహాయమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి.. రాష్ర్టానికి ఏం చేశారని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన వల్ల రాష్ర్టానికి ఒక్క టీకా, పీపీఈ కిట్, కనీసం ఒక్క గోలీ అయినా ఎక్కువగా వచ్చిందా? అని నిలదీస్తున్నారు. కనీసం రాష్ట్ర అవసరాలకు సరిపడా ఆక్సిజన్ అయినా ఇప్పించగలిగారా? ఒక్క ఆక్సిజన్ ట్యాంకర్ అయినా ఎక్కువ ఇప్పించగలిగారా? అని మండిపడుతున్నారు. ఇక్కడి ప్రజలు ఓటేస్తేనే ఎంపీ, కేంద్రమంత్రి అయిన కిషన్రెడ్డికి.. ఆ ప్రజల ప్రాణాలు రక్షించే బాధ్యత లేదా? అసలు రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివి అయి ఏంలాభం అని ప్రశ్నిస్తున్నారు.