నిజామాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మొదటి దశతో పోలిస్తే రెండో దశ అత్యంత సంక్లిష్టంగా మారింది. ఏడాది క్రితం వైరస్ విస్తృతిలో లక్షణాలు ఉన్న వారంతా సరైన చికిత్సతో ప్రాణాలు నిలబెట్టుకున్నారు. చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినా.. వెంటనే వైద్య సాయంతో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నారు. ఇప్పుడు రెండో దశ కరోనా వ్యాప్తిలో వైరస్ మ్యూటెంట్లు భిన్నంగా దూసుకుపోతున్నాయి. వైద్యరంగ ప్రముఖులకే అంతుచిక్కని విధంగా కరోనా బాధితుల్లో వైరస్ భారీగా విస్తరించి అవయవాలను దెబ్బతీస్తున్నది. కోలుకునేలోపే ప్రాణాలను తీస్తున్న ఈ గడ్డు కాలంలో పేద, మధ్యతరగతి వర్గాలకు స్కానింగ్, టెస్టులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చు లేకుండా వైద్యం అందుతున్నప్పటికీ, స్థోమతను బట్టి కొందరు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
రెండో దశలో కరోనా వైరస్ను గుర్తించడానికి సీటీ స్కానింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. స్కానింగ్ చేసుకోవాలంటే సామాన్యులకు వాటి ధరలు ఇబ్బందిగా మారింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చొరవతో నిజామాబాద్లో స్కానిం గ్ సెంటర్లలో ధరలు దిగొచ్చాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచనతో సీటీ స్కానింగ్కు రూ.2వేలు తీసుకునేందుకు నిర్వాహకులు సమ్మతించారు.
మంత్రి సూచనతో కలెక్టర్ సమీక్ష
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడు సీటీ స్కానింగ్ సెంటర్లున్నాయి. కేంద్రాల యాజమా న్యాలు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కార్యవర్గ సభ్యులతో మంత్రి వేముల నేరుగా మాట్లాడా రు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రత్యేకంగా వారితో సమావేశమై ధరల అంశంపై ఆదివారం తన చాంబర్లో చర్చించారు. మంత్రి సూచన మేరకు రూ.2 వేలు తీసుకుంటామని వారంతా సమ్మతించారు. సీటీ స్కానింగ్ యాజమాన్యాల తోనూ ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ రవీందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవన్ రావు, ఐఎంఏ జిల్లా కార్యదర్శి డాక్టర్ విశాల్ చర్చలు జరిపారు. కలెక్టర్తో నిర్వహించిన సమావేశంలోనూ ఆయా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు, ఐఎంఏ బాధ్యులంతా తమ నిర్ణయాన్ని వెల్లడించడంతో వారిని నారాయణ రెడ్డి అభినందించారు. మానవతా ధృక్పథంతో క్లిష్టమైన సమయంలో చొరవ తీసుకోవడం మంచి పరిణామమని వైద్యులను, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను కలెక్టర్ కొనియాడారు. ఇదే స్ఫూర్తితో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే వరకు పేద, మధ్య తరగతి ప్రజలకు భారం లేకుండా సేవ చేసేందుకు ప్రయత్నించాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ విప్ గంప చొరవతో..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ కొవిడ్ ట్రీట్మెంట్ కోసం వస్తున్న వారు సీటీ స్కాన్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. జేబులకు చిల్లులు పడుతున్న వైనాన్ని గుర్తించిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆదివారం తన వంతు ప్రయత్నం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా కార్యవర్గంతో, స్కానింగ్ సెంటర్ యాజమాన్యాలతో మాట్లా డారు. రూ.2వేలకు సీటీ స్కానింగ్ చేయాలని ప్రభుత్వ విప్ చేసిన సూచనకు వారంతా అంగీకరించారు. కామారెడ్డి పట్టణంలో రెండు సీటీ స్కానింగ్ సెంటర్లున్నాయి. వీటిల్లోనే హెచ్ఆర్సీటీ, సీటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, కామారెడ్డి జిల్లా కేంద్రం లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చొరవతో ప్రజలకు భారీ ఊరట దక్కింది. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగెటివ్ వస్తున్న వారంతా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పనిసరిగా సీటీస్కాన్ చేసుకోవాల్సి వస్తున్నది. ఇలాంటి కేసులే ఇప్పుడు తీవ్రమైన పరిస్థితికి తీసుకు పోతోంది. ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు ఇబ్బంది పడుతూ వచ్చారు. తాజా నిర్ణయంతో ప్రజలందరికీ ఊరట దక్కనుంది.