కరోనా వైరస్ ఉదృతంగా ఉన్న నేపథ్యంలో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ ప్రముఖులు విరాళాలు అందచేశారు. తొలుత హీరో సూర్య కుటుంబం కోటి రూపాయల విరాళం ఇచ్చింది. అలాగే, హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా రూ.25 లక్షలు ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల విరాళం అందించారు. ప్రముఖ హీరో అజిత్ 25 లక్షల రూపాయలు ఆన్లైన్ ట్రాన్సఫర్ చేశారు.
ఇక రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ తన భర్త విశాగన్ వనంగముడి, మామ ఎస్ఎస్ వనంగముడితో కలిసి తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసి కోటి రూపాయల విరాళం అందించారు. తమ ఫార్మా కంపెనీ అపెక్స్ లాబోరేటరీ తరపున ఈ విరాళం అందించినట్టు సౌందర్య పేర్కొంది. ఇదిలావుంటే, కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉండగా, మరికొన్ని చోట్ల కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు, ఆక్సిజన్, మందులు, బెడ్ల కొరత వేధిస్తోంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి తమకు చేతనైనంత సాయం అందిస్తున్నారు.