న్యూఢిల్లీ: టైమ్స్ గ్రూపు చైర్మన్ ఇందూ జైన్ కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత రుగ్మతలతో ఆమె మరణించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆమె వయసు 84 ఏళ్లు. ఇందూ జైన్ దార్శనికురాలు అని టైమ్స్నౌ టీవీ ఛానల్ యాజమాన్యం కొనియాడింది. ఆధ్యాత్మికతతో జీవించారని, దానధర్మాలు చేశారని, కళలను అమితంగా ఇష్టపడేవారని, మహిళల హక్కుల కోసం పోరాడినట్లు టైమ్స్ నౌ పేర్కొన్నది. ఢిల్లీలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు వర్గాలు తెలిపాయి. ఇందూ జైన్ మృతి పట్ల రాజకీయవేత్తలతో పాటు ప్రముఖులు సంతాపం తెలిపారు.1999లో ఆమె టైమ్స్ గ్రూపునకు చైర్మన్ అయ్యారు.
భిన్నమైన నాయకత్వ లక్షణాలతో ఆమె ఆకట్టుకున్నారు. టైమ్స్ గ్రూపు అభివృద్ధికి ఆమె ఎంతో దోహదం చేశారు. ద టైమ్స్ ఫౌండేషన్ను ఆమె 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తుఫాన్లు, భూకంపాలు, వరదలు, మహమ్మారులు, ఇతర సంక్షోభ సమయాల్లో టైమ్స్ రిలీఫ్ ఫండ్తో ఆమె ఆదుకున్నారు. 2016లో ఆమెకు పద్మ విభూషన్ అందజేశారు. తన అవయవాలు దానం చేయాలన్నది ఆమె జీవితాశయం. కానీ కోవిడ్ లక్షణాలతో మరణించడం వల్ల ఆమె కోరిక తీరలేదు. 2000 సంవత్సరంలో యూఎన్ ఆధ్వర్యంలో జరిగిన మిలీనియం వరల్డ్ పీస్ సదస్సులో ఆమె ప్రసంగించారు. ఇందూ జైన్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.