న్యూఢిల్లీ : సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై విమర్శల నేపథ్యంలో ఇండియా గేట్ సమీపంలోని నిర్మాణ స్థలంలో ఫొటోగ్రఫీ, వీడియో చిత్రీకరణను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నిషేధించింది. ఈ మేరకు నిర్మాణ ప్రాంతంలో సైన్బోర్డులు ఏర్పాటు చేసింది. దీనిపై సీపీడబ్ల్యూడీలోని ఓ అధికారిని సంప్రదించగా.. దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తలపెట్టిన ప్రాజెక్టే ‘సెంట్రల్ విస్టా’. కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్పథ్ను పునరుద్ధరించనున్నారు. ప్రసుత్తం కొనసాగుతున్న మహమ్మారి నేపథ్యంలో పలు పౌర సమాజ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణ సంస్థలు ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టును నిలిపివేయాలని బుధవారం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రూ.13,450 కోట్ల నిధులను కొవిడ్ సమస్యల పరిష్కారం కోసం వినియోగించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.