కరోనాను ఎదుర్కొనడానికి, దానిపై పూర్తి అవగాహన అవసరం. ఇది ఒక వ్యాధి, మహమ్మారి. దీన్ని ఒక వ్యాధిలా ఎదుర్కొంటేనే నియంత్రణ సాధ్యం అవుతుంది. లేకుంటే గతి తప్పుతుంది. ఎలా అయితే ఒక వైద్యుడి నిర్ణయం ఒక వ్యాధిని బట్టి కాకుండా లాభాపేక్షతో నిర్ణయం తీసుకుంటే సత్ఫలితాలు ఇవ్వదో అలా. సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు ప్రారంభించినప్పుడే సత్ఫలితాలు వస్తాయి. కరోనా దీర్ఘకాలిక సమస్య. దాని కట్టడికి తక్షణ, మధ్యమ, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. కనీసం మానసికంగా ఒక త్రాయవర్ష ప్రణాళికతో ముందుకువెళ్లాలి.
కరోనా కట్టడికి మాస్ యాక్షన్తో పాటు స్మార్ట్ యాక్షన్ కూడా అవసరం.కరోనా వల్ల ఆరోగ్య వ్యవస్థ ఎంత దుర్భరమవుతుందో, ఆర్థిక వ్యవస్థ కూడా అంతకంటే ఎక్కువ నష్టపోతుంది. గనుక, కరోనాపై పోరాటం సుదీర ్ఘమైనది. ఆర్థికవ్యవస్థ కుప్పకూలకుండా ఉంటేనే, కరోనా కట్టడికి ప్రణాళిక విజయం సాధిస్తుంది.కరోనాపై పోరు ఉమ్మడి బాధ్యత. ప్రజలు, ప్రభుత్వం కలిసి నడువాలి. ఇది పాండమిక్ గనుక పాన్ ఇండియా యాక్షన్ప్లాన్ లేకుంటే, ఏ ఒక్క రాష్ట్రంలో కట్టడి చేసినంత మాత్రాన పూర్తిగా విజయం సాధించలేం. కరోనా పూర్తిస్థాయిలో కట్టడి అయ్యేవరకు రాజకీయ విభేదాలు పక్కనపెట్టి, దేశ ప్రజలందరినీ ఒకతాటిపైకి తెచ్చి పని చేసినప్పుడే మనం విజయం సాధిస్తాం.
ఈ మహమ్మారి సమయంలో ఒకరికి ఇంకొకరు తోడ్పడుతూ ఒక కో-ఆపరేటివ్ మోడల్లో పోతే అందరికి మంచిది. చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలన్నట్లు మన నిర్ణయాలు ‘పెన్నీ వైస్ పౌండ్ ఫులిష్’గా ఉండొ ద్దు. ఇవి మనం అర్థం చేసుకుంటే, తీసుకునే నిర్ణయాల సార్థకత ఉంటుంది. కరోనా కట్టడిలో ప్రభుత్వాల పిసినారి తనం ప్రమాదంలోకి నెట్టుతుంది. ఇదే అదనుగా దేశాన్ని దెబ్బతీయాలని అనేక దేశాలు గుంటనక్కలా వేచి ఉన్నాయి. మనం ఒక ఉమ్మడి పోరు, ఉమ్మడి బాధ్యతతో మెలగాలి. హిరోషిమా యుద్ధ దుర్ఘటన తర్వాత జపాన్ ఎలా ఒక ఆర్థిక సూపర్ పవర్గా ఎదిగిందో, మనం ఈ ప్యాండమిక్ నుంచి ఒక ప్రబలశక్తిగా ఎదగాలి. ఇది మనకు ఒక అవకాశంగా మారాలి.
టెస్ట్, ట్రేస్, ట్రీట్, కంటైన్ (కట్టడి), వ్యాక్సిన్… మనకు ప్రస్తుతం ఉన్న కార్యాచరణ. మనం కొత్తగా పరిశోధించి కనుక్కోవలసిందిలేదు. వీటిని త్రికరణశుద్ధితో అమలుచేస్తే చాలు. రోజుకు నాలుగు లక్షల కరోనా కేసులు వస్తున్న తరుణంలో కరోనా కట్టడి అతి ముఖ్యం. లేకుంటే మనకున్న వైద్య సదుపాయాలు కుప్పకూలే అవకాశం ఉన్నది. వ్యక్తిగత కట్టడి, మాస్క్, భౌతికదూరం, శుభ్రత అనే త్రిదండి వ్యూహం అవసరం.
ప్రభుత్వాలన్నీ మొదటి వేవ్లో ఒక టీంగా పనిచేసి అద్భుతంగా నియంత్రిచగలిగాయి. మొదటి దశలో పూర్తి బాధ్యతగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, రెండవ దశ వస్తుందని తెలిసినా అలసత్వంతో వ్యవహరిం చింది. రాజకీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వటంతో దేశం మూల్యం చెల్లిస్తున్నది. నెలకు కనీసం 10- 20 కోట్ల వ్యాక్సిన్ డోసులు తయారుచేసే అవకాశం ఉన్న, ఆ కంపెనీలకు, ఇతర దేశాలు సెప్టెంబర్ 2020 నుంచే ముందుగా బుక్ చేసుకున్నా, మనం ఒక్క రూపాయి అడ్వాన్స్ ఇవ్వకుండా, ఒప్పందం చేసుకోకుండా నిర్లిప్తంగా ఉన్నాం. ప్రపంచ మందుల తయారీలో 18శాతం ఉన్న మనం; ఆక్సిజన్, ఇతర మందుల తయారీ, నిల్వలలో ముందు ప్రణాళిక లోపించింది.
ఒక జిల్లా, రాష్ట్రం లేదా దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిచర్యలు.. 144 సెక్షన్ (నలుగురు ) 288 సెక్షన్ (8 మంది), లిమిటెడ్ కర్ఫ్యూ, ఫుల్ కర్ఫ్యూ, పాక్షిక లాక్డౌన్, పూర్తి లాక్డౌన్, రవాణా బంద్, అంతర్రాష్ట్ర రవాణా బంద్… ఇలా అనేక విధాలుగా కట్టడి చేయవచ్చు. మొదటి కరోనా వేవ్ అప్పుడు కొవిడ్ ప్రోటోకాల్, మైక్రో కంటైన్మెంట్ ద్వారా కరోనాను కట్టడి చేయగలిగాం. కరోనాతో సుదీర్ఘ పోరాటం గనుక, పూర్తిస్థాయిలో లాక్డౌన్ చివరి అస్త్రంగా ఉపయోగించాలి.
టెస్ట్, ట్రేస్, ట్రీట్… ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య. కరోనా వచ్చినా మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది అనే ధైర్యం ఉంటే అదే కొండంత బలం. ప్రభుత్వం ఒక హెల్ప్లైన్, డాష్బోర్డు, ప్రథమ, సెకండరీ, టెరియటరీ కేర్ సెంటర్లు, వాటికి సంబంధించిన వివరాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో అన్ని సదుపాయాల అనుసంధానకర్తగా ప్రభుత్వం ఒక వ్యవస్థ ఏర్పాటు అవసరం. ప్రతి దవాఖానలో సొంత గా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు, అందుకు అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా లేదా ఆత్మ నిర్భర్ ద్వారా ఆర్థిక దన్ను విరివిగా ఇవ్వడం అవసరం. మందులు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా, ప్రతీది ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకోవాలి. అవసరమైన దవాఖానలు, పేషెంట్లు ఒక పారదర్శకతతో పంపిణీ ఏర్పాటు చేయాలి. వైద్య సిబ్బందికి ఎమర్జెన్సీ కోర్సులు నిర్వహించి, ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫెరల్ ఆస్పత్రులకు అందుబాటులో ఉండేటట్టు ప్రణాళిక అవసరం. హాస్పిటల్స్ (ప్రభుత్వ, ప్రైవేట్)లలో పరికరాలు, సామర్థ్యం పెంచటానికి, ఫార్మా కంపెనీల సామర్థ్యం పెంచటానికి వెంటనే సాఫ్ట్ లోన్ ఇస్తే లాభం. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలె. టెస్ట్, ట్రేస్, కోసం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 12,769 గ్రామ పంచాయతీలు, 592 మండలాలు, 121 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లు, 3,606 వార్డులు ఇలా మనకు వ్యవస్థ ఉంది. గతంలో లాగా ప్రతి యూనిట్ ఒక క్లస్టర్గా తీసుకొని వైద్య, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బంది కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో పోయేవరకు పనిచేయాలి. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్మెంట్, హెల్ప్ ఇలా ఒక బ్లాక్ చైన్ మోడల్తో చేయటానికి ఆస్కారం ఉంది. వీటితో పాటు ఎన్జీవోలను కూడా భాగస్వాములు చేస్తే చాలా మంది యువత ముందుకువస్తారు. ప్రైవేట్ దవాఖానలు అత్యుత్తమ సేవలు అందిస్తున్నా, ఫీజుల విషయంలో ఒక పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో మిగతా చోట్ల కంటే టెస్టులు (జనాభాతో పోల్చుకుంటే) మంచి నిష్పత్తిలో జరుగుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య తక్కువ ఉన్నా, కరోనా ఉధృతి గ్రామాలకు పాకుతున్నది. ఇది ఆందోళనకరం. దీన్ని అడ్డుకోవటం కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రభుత్వరంగంలో బెడ్స్ అందుబాటులో ఉన్న, ఖాళీగా ఉన్న, ప్రైవేట్రంగంలో పడకల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కరోనా సెంటర్ల మీద నమ్మకం పెంచవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేషన్ బెడ్స్ సదుపాయం అవసరం.నిమ్స్, ఐయిమ్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఈ వసతులు కల్పించవచ్చు.
అంతిమంగా కరోనా కట్టడి అనేది ఒక మారథాన్ రేస్ లాంటిది. మొదట మనం మానసికంగా సిద్ధం కావాలి. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూనే కరోనాను కట్టడి చేయాలి. ప్రజలు, సమాజం, ప్రభుత్వం తమ తమ బాధ్యత నిర్వహిస్తే ఫలితం తథ్యం.
వ్యాక్సిన్: ఇప్పటికే వ్యాక్సిన్ వల్ల కరోనా వ్యాధి ఉధృతి, మరణాల సంఖ్య తక్కువ ఉంటుందని నిరూపించబడింది. కాబట్టి పేద, మధ్య తరగతి ప్రజల్లో ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా, ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లకు ప్రైవేట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు లాభాపేక్ష లేకుండా ఇచ్చి, 2021 నాటికి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయడం మంచిది. ఇందులో పిసినారితనం మంచిది కాదు. లక్షల కొద్దీ దవాఖానల్లో బిల్లులు కట్టేకంటే 400- 600 రూపాయలు ఎక్కువ కాదు.
మైక్రో కంటైన్మెంట్ జోన్స్: ఇవి చిన్న చిన్న సమూహాలు లేకుండా చేయడం ద్వారా కరోనా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా నిరోధించటానికి దోహదపడుతుంది. మార్కెట్లు, దుకాణాలు, గుళ్లు, గోపురాలు, చర్చిలు, మసీదులు, శుభ, శోకాతప్త కార్యాలు, మీటింగులు, ఇంటా, బయట పార్టీలు, మందు దుకాణాలు, హోటల్స్, రాజకీయ, మత పరమైన సమావేశాలు ఇహ, పరబేధం లేకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్నది.
డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
(వ్యాసకర్త: భువనగిరి మాజీ ఎంపీ,
చైర్మన్- డాట్స్)