మొదటి ప్రాధాన్యతలో తేలని అభ్యర్థి గెలుపు
కొనసాగుతున్న అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియ
4వ రోజుకు చేరిన ఉత్కంఠ
సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యతా ఓట్లు లెక్కిస్తున్నారు. బరిలో 93 మంది అభ్యర్థులు ఉండడంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుండడంతో శనివారం వరకు చివరి ఫలితం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేటి సాయంత్రంలోగా పట్టభద్రులు ఏ అభ్యర్థికి పట్టం కట్టారో తేలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఏడు రౌండ్ల లక్ష్యంతో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. గురువారం రాత్రి 11 గంటల వరకు నాలుగో రౌండ్ కొనసాగగా, శుక్రవారం 11 గంటల వరకు ఏడు రౌండ్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేసి అభ్యర్థులకు పోలైన ఓట్లను ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏడో రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ఫ్రొఫెసర్ నాగేశ్వర్కు 53,610 ఓట్లు, మరో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్థన్ రెడ్డికి 9783 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యతలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి 8021 ఓట్లు ఆధిక్యం సాధించారు. కాగా, మొత్తం 21309 చెల్లని ఓట్లుగా తేల్చారు. ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల సమయం పడుతుందని భావించినా ప్రస్తుతం నాలుగో రోజుకు చేరడం విశేషం.
కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ..
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. మూడు షిప్టుల్లో ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు అతి తక్కువ ఓట్లు వచ్చిన 40 మందిని ఎలిమినేషన్ చేశారు. 40 మంది ఎలిమినేషన్తో టీఆర్ఎస్కు 163, బీజేపీకి 146, నాగేశ్వర్కు 91, కాంగ్రెస్కు 78 ఓట్లు వచ్చాయి. ఇందులో కనిష్టంగా 8 ఓట్ల నుంచి 51 ఓట్లు సాధించిన వారు ఉన్నారు. 82వ ఎలిమినేషన్ నుంచి 500లకు పైబడి ఓట్లు సాధించిన వారు ఉండనున్నారు. అప్పటి నుంచి రెండో ప్రాధాన్యత ఓట్ల బదలాయింపు అనేది పుంజుకోనున్నది.
లెక్కింపు ప్రక్రియ మరింత స్పీడ్..
నెమ్మదిగా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియలో మరింత వేగం పెంచాలని అధికారులు నిర్ణయించారు. మొదటగా రెండు టేబుళ్ల నుంచి అదనంగా మరో టేబుల్ను ఏర్పాటు చేశారు. అవసరమైతే మరిన్ని టేబుళ్లను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఏజెంట్లను సమకూర్చుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించారు.