మాదాపూర్, మార్చి 17: ట్రాఫిక్ ఉల్లంఘనలు, మద్యం సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపిన వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇందుకోసం మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు స్టేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతూ డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి టెస్టులను చేస్తు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, డ్రైవింగ్ చేస్తు ఫోన్ మాట్లాడటం, అతివేగంగా వాహనాలను నడపడంతో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని వాహనదారులకు తెలియజేస్తు ప్రయాణికుల భద్రతే తమ కర్తవ్యంగా భావిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు.
పటాన్చెరు పాత టోల్గేట్ వద్ద చెక్పోస్ట్ను ఏర్పాటు చేసి పటిష్టమైన చర్యలు తీసుకుంటు వచ్చిపోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. 24 గంటలు తనిఖీలు చేసేలా మూడు షిప్టులను ఏర్పాటు చేసి ఒక ఇన్స్పెక్టర్, నలుగురు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, కారు సీట్ బెల్ట్, నంబర్ ప్లేట్, డ్రైవింగ్ లైసెన్సు వంటి వాటిని ప్రధానంగా పరిశీలిస్తున్నారు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వేగంగా వాహనాలు నడపడం, రాంగ్ రూట్లో వచ్చిన, సిగ్నల్ జంప్, ఆటోలో పరిమితికి మించి ప్రయాణం వంటివి చేసినా కేసులు నమోదు చేస్తున్నారు. ద్విచక్రవాహనాలపై డ్రైవింగ్ చేసే వారితోపాటు వెనుకాల కూర్చున్న వారికి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.
సెల్ఫోన్ డ్రైవింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చిన్న పాటిదే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తు వాహనాలను నడిపే వారికి హెచ్చరికలు చేస్తున్నారు. ఇప్పటికే మద్యం సేవించి, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిని కూకట్పల్లి ప్రశాంత్నగర్లోని 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి చార్జ్షీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. దీంతో కోర్టు వారు జరిమానా, జైలు వంటి శిక్షలను అమలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో రోజుకు 25 నుంచి 30 కేసులు వరకు నమోదవుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆకతాయిలు, మద్యం సేవించి నిర్లక్షంగా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవు. ఇలాంటి వారి కోసం ప్రధాన కూడళ్ల వద్ద ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను ఏర్పాటు చేస్తు పట్టుబడిన వారిపై చార్జ్షీట్ నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నాం. కోర్టు వారు జరిమానాతోపాటు జైలు శిక్షలు విధిస్తున్నారు. రోడ్డుపై సూచికలు, సిగ్నల్ లైట్స్ వంటివి ఏర్పాటు చేయించాం. హెల్మెల్ తప్పకుండా వాడాలని తెలియజేస్తు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నాం. తరుచూ తనిఖీలు చేయడం వల్ల మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలను నడపడం వంటివి తగ్గడంతోపాటు 90 శాతం మంది హెల్మెట్లు ధరిస్తున్నారు. సుమన్, మియాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్