నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని ఆరుగురు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల విద్యార్థినులకూ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. కానీ విద్యార్థినుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు.
నగరంలోని నాగోల్ బండ్లగూడ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో సుమారు 36 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యులు మిగిలిన విద్యార్థులకు కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేస్తున్నారు. భయంతో పలువురు విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు పాఠశాలకు చేరుకొని పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు.