కుటుంబ పోషణతో పాటు ఉద్యోగ బాధ్యతల్ని ఒంటిచేత్తో నడిపించగల సత్తా మహిళలకు ఉంటుంది. తమ జీవితాన్నే కాకుండా తోటి మహిళల జీవితాల్లోనూ వెలుగులు నింపుతూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు కొందరు. ఆ కోవలోకే వస్తారు ఉత్తరాఖండ్కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మేధావి కీర్తి ఐఎఫ్ఎస్.
‘ధాత్రి’ పేరుతో ఒక బ్రాండ్ను తయారు చేసి, భద్రిగాడ్ ప్రాంత మహిళల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు కీర్తి. గతేడాది మే నెలలోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా ఆ ప్రాంతానికి వెళ్లారామె. తన విధులను సమర్థంగా నిర్వర్తిస్తూనే, గ్రామస్తుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే సాధికారత సాధ్యమవుతుందని ఆ దిశగా చర్యలు చేపట్టారు. కొందరు మహిళలకు దీపపు కుందులు, కుండలు, అగరు
బత్తీలు చేయడంలో శిక్షణ ఇప్పించారు. ప్రాంతీయ పంటలైన సజ్జలు, రాజ్మా వంటి ధాన్యాలతో విభిన్న ఆహార పదార్థాలు చేయించడంలో తర్ఫీదునిప్పించారు. మరికొందరికి కుట్లు, అల్లికలు, పేపర్ ప్లేట్ల తయారీ నేర్పుతున్నారు. అంతేకాదు, వారు చేసిన వస్తువులు అమ్ముకునే ఏర్పాట్లు చేస్తున్నారు. మార్కెటింగ్ మెలకువలనూ నేర్పుతున్నారు. కీర్తి వచ్చినప్పటి నుంచీ ఆ ప్రాంత మహిళల ఆదాయం పదిరెట్లు పెరగడమే ఆమె కృషికి నిదర్శనం. అందుకే అక్కడివారంతా కీర్తిని ‘రేంజర్ దీదీ’ అని అప్యాయంగా పిలుచుకుంటారు.
‘మొదట్లో ఇక్కడి ప్రజలను ఒప్పించడం కాస్త కష్టమైంది. కానీ, మా సీనియర్ ఆఫీసర్ నసీమ్ మేడమ్ సాయంతో నేను ఈ పనిని పరిపూర్ణంగా చేయగలుగుతున్నాను. ఇదంతా గతేడాది దీపావళి పండుగ ముందు మొదలైంది. మెషీన్లు, ట్రైనర్లను ఏర్పాటు చేసి స్థానిక మహిళలకు దీపపు కుందులు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాం. దాంతో మా ధాత్రికి పునాదులు పడ్డాయి. ఇప్పుడు మెల్లిమెల్లిగా మా బ్రాండ్ వస్తువుల నాణ్యతకు మంచి పేరు, మహిళలకు లాభాలు రావడం చాలా సంతోషంగా ఉన్నద’ని చెప్తున్నారు మేధావి కీర్తి. ఒక మహిళగా సాటి మహిళల ఎదుగుదలకు సాయపడటం ఆనందంగా ఉన్నదని గర్వంగా చెప్పారు కీర్తి.