ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల పనితీరుపై రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంతృప్తి వ్యక్తంచేశారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్, గండిపేట మండలాలకు చెందిన ఎమ్మెల్సీ ఎన్నికల బూత్ ఇన్చార్జిలతో మంత్రి హరీశ్రావు సెల్ఫోన్ ద్వారా ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె.రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు బి.సాయిరెడ్డి, రాజేంద్రనగర్ పట్టణ పరిధిలోని వనం శ్రీరాంరెడ్డి, ధర్మారెడ్డి, మహేశ్లతో పాటు శంషాబాద్ మండలానికి చెందిన చంద్రారెడ్డి, మహేందర్రెడ్డి తదితర ముఖ్య నేతలతో మంత్రి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆయా పరిధిలో మొత్తం ఓటర్లు ఎంతమంది.. మీరెంత మందిని కలిసి ఓట్లను అభ్యర్థించారు.. వారి స్పందన ఎలా ఉంది, ఇతర పార్టీల వారు కలిశారా? అంటూ నేతలతో మాట్లాడారు. స్థానిక నాయకులు కలిసిన వారికి ఫోన్ చేసిన మంత్రి కాన్ఫరెన్స్లోనే పలుకరించారు. చివరగా స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్తో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ ప్రకాశ్ అన్నా.. మీ నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు మంచిగా పనిచేస్తున్నారు.. గుడ్జాబ్.. వెల్డన్ అంటూ మంత్రి సంతృప్తిగా మాట్లాడారు. మరో రెండు రోజులు కీలకమని ప్రతి ఒక్కరూ ఆయా బూత్లలోని ఓటర్లను పోలింగ్ బూత్ వరకు తీసుకువచ్చి ఓటింగ్శాతం పెంచేలా కృషిచేయాలని మంత్రి కోరారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని హోంమంత్రి మహమూద్ అలీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉప్పల్ సర్కిల్లోని భద్రాస్ గ్రాండ్లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీదేవిని ఎంపిక చేశారన్నారు. పట్టభద్రులు ఆలోచించి వాణీదేవికి సీరియల్ నంబర్ 4లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. విద్యావంతులంతా ఓటింగ్లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు బేతి సుభాష్రెడ్డి, క్రాంతి కిరణ్ మాట్లాడుతూ పట్టభద్రులనుంచి వాణీదేవికి మంచి మద్దతు లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బూత్ స్థాయి ఇన్చార్జిలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ ) : ఈ నెల 14వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లు సమర్థవంతంగా వ్యవహరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారు. శుక్రవారం అంబర్పేట, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎన్నికల ఇన్చార్జిలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి తలసాని సమావేశం నిర్వహించారు. ఉదయం 8నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియలో పోలింగ్ బూత్ ఏజెంట్లు ఆయా బూత్ల పరిధిలోని గ్రాడ్యుయేట్స్ ఓటర్లు పూర్తి స్థాయిలో హాజరు అవుతున్నారా? అనే విషయాన్ని పరిశీలించాలని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు, పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఇన్చార్జిలు నారదాసు లక్ష్మణ్రావు, దుర్గం చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నది. శుక్రవారం రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. 2లక్షల50వేలకు పైగా సభ్యులతో 27సంఘాలతో రిటైర్డ్ ఉద్యోగుల, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ మంత్రి గంగుల కమలాకర్కు తీర్మానం చేసిన ప్రతిని అందజేశారు. రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కొలిశెట్టి లక్ష్మయ్య, సెక్రెటరీ జనరల్ సుధాకర్ రావు, ఫైనాన్స్ సెక్రెటరీ జ్ఞానేశ్వర్లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు..
క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ, యునైటెడ్ పాస్టర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు శుక్రవారం మంత్రి గంగులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
అబిడ్స్, మార్చి 12 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మైనార్టీ న్యాయవాదులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్హుస్సేన్, వక్ఫ్బోర్డు డైరెక్టర్ వహీద్ అహ్మద్ ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిసి ఈ విషయాన్ని తెలిపారు.
బోడుప్పల్, మార్చి12 : పట్టభద్రులు వివేకంతో ఆలోచించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలువాలని రాష్ట్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం బోడుప్పల్లోని బొమ్మక్ బాలయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్రెడ్డి, బోడుప్పల్ పట్టణ ఇన్చార్జి ఆంజనేయులు గౌడ్తో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సరళిపై స్థానిక పార్టీ నాయకులు, ఇన్చార్జిలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ బలపర్చిన సురభి వాణీదేవి గెలుపు ఖాయమని, పట్టభద్రులు వాణీదేవికే పట్టం కడుతారని ధీమావ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, నాయకులు కొత్త రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 12, (నమస్తే తెలంగాణ) : న్యాయవాదుల పక్షపాతిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్యాదవ్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్పార్టీ అభ్యర్థులైన సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకే న్యాయవాదులంతా మొదటి ప్రాధాన్యత ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీగా పనిచేసిన రాంచందర్రావు న్యాయవాదులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఏర్పాటులో నాలుగున్నరేండ్ల జాప్యానికి కారణం కేంద్రంలోని బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ బార్ అసోసియేషన్లకు రూ.50వేల నుంచి రూ.10లక్షల వరకు నిధులు కేటాయించారని, న్యాయమూర్తుల నియామకంలో సామాజిక న్యాయం పాటించారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో న్యాయవాదులు రవికుమార్, శ్రీనివాస్, సైదులు, లక్ష్మి, శ్రీవల్లి, కవిత పాల్గొన్నారు.