ముంబై: విమానాలను నడిపేందుకు వాడే ఫ్యూయల్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు పౌర విమాన యాన శాఖ పని చేస్తున్నది. దీనిపై కసరత్తు చేయాలని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు శుక్రవారం గ్లోబల్ ఏవియేషన్- ఎయిర్ కార్గో అంశంపై జరిగిన వర్చువల్ సదస్సులో విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా తెలిపారు.
విమానాల నిర్వహణలో ఏటీఎఫ్ లేదా జెట్ ఫ్యూయల్ ఖర్చులే 45-55 శాతం. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఈ ఖర్చు అధికంగా ఉంటున్నది. దీంతో ఏటీఎఫ్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కేంద్రాన్ని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలంటే జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రదీప్ సింగ్ ఖరోలా చెప్పారు.
దేశీయ గగనతలాన్ని పూర్తిస్థాయి వినియోగానికి తీసుకురావడానికి తీసుకున్న చర్యలను ప్రదీప్ సింగ్ ఖరోలా వెల్లడించారు. వివిధ రంగాలతో పాటు విమానయాన రంగం కూడా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తట్టుకుని నిలబడిందని ఖరోలా అన్నారు. ఇందులో సరకు రవాణాదే కీలక పాత్ర అని పేర్కొన్నారు.