వేములవాడ కల్చరల్ : వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో బుధవారం హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. జడ్పీ అధ్యక్షురాలు అరుణ, ఎస్పీ రాహుల్ హెగ్డే, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హెలికాప్టర్ వద్ద పూజలు చేసి, సేవలను ప్రారంభించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, అదనపు కలెక్టర్లు ఆర్ అంజయ్య, బీ సత్య ప్రసాద్, ఆర్డీఓ శ్రీనివాస రావు, డీఎస్పీ చంద్రకాంత్, ఆలయ ఈఓ శ్రీ కృష్ణ ప్రసాద్ హెలికాప్టర్లో ప్రయాణించి.. గగనతలంనుంచి ఆలయ పరిసరాలు, ఏర్పాట్లను వీక్షించారు.
హెలికాప్టర్ సేవలు వేములవాడలో ఈ నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి. వేములవాడ నుంచి నాంపల్లి వరకు 7 నిమిషాల గగనతల ప్రయాణానికి ప్రతి ఒక్కరికీ రూ.3వేలు, అలాగే వేములవాడ నుంచి నాంపల్లి మీదుగా మిడ్మానేరు డ్యామ్ అందాలను వీక్షించేందుకు 15 నిమిషాలకు రూ.5500 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే రాజన్న భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు సర్వీసులను సైతం జడ్పీ అధ్యక్షురాలు, అడిషనల్ కలెక్టర్ ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడి చెరువు వరకు, చెరువు వద్ద నుంచి బస్టాండ్కు భక్తులు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.