న్యూఢిల్లీ: రెండో విడుత బడ్జెట్ సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. లోక్సభ ప్రారంభం కాగానే.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ప్రతిపక్షాలు బెట్టువీడకపోవడంతో చివరికి పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ప్రకటన చేశారు. గత ఏడేండ్లలో ఎల్పీజీ సిలిండర్ ధర దాదాపు రెట్టింపు అయ్యిందని తెలిపారు. 2014 మార్చి నెలలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.410 ఉండగా.. ప్రస్తుతం రూ.819కి పెరిగిందని చెప్పారు. ఇక అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో హెచ్చుతగ్గులు, పన్నులు తదితర కారణాల వల్ల ఇంధన ధరలు పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్పై పన్నులను పెంచడం వల్ల ఆదాయం దాదాపు 459 శాతం పెరిగిందని చెప్పారు. మరోవైపు, రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే ఇంధన ధరలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. గందరగోళం చెలరేగటంతో సభ మంగళవారానికి వాయిదా పడింది. ఇంకోవైపు, ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను కుదించాలని పలు పార్టీలు సూచించాయి. దీంతో మార్చి 27కు ముందే బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశముంది.