కేంద్ర ప్రభుత్వానిది ఆదినుంచీ అదే తీరు
ప్రగతికి ప్రతిబంధకం.. వెయిటేజీ తగ్గింపు
గాడి తప్పిన రాష్ర్టాలకే ప్రయోజనం
ఆర్థికసంఘం సిఫారసులూ బేఖాతర్
కేంద్రం నుంచి వాటా రావడం లేదని.. తమ నుంచే కేంద్రానికి అధిక నిధులు సమకూరుతున్నాయని సీఎం కేసీఆర్ పక్కా లెక్కలతో పలుసార్లు విశ్లేషించారు. కేంద్రం ఏమి ఇచ్చింది.. రాష్ర్టానికి ఎంత మేలు చేస్తుందో చర్చకు సిద్ధమని కూడా గతంలో సవాల్ చేశారు. జనాభాను నియంత్రించి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ర్టాలను ప్రోత్సహించకపోతే పరిస్థితి ఏమిటని రాష్ర్టాలు అడుగుతున్న ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానమే లేకుండాపోయింది.
ప్రత్యేక ప్రతినిధి, మార్చి 7 (నమస్తే తెలంగాణ): కొత్త రాష్ట్రం తెలంగాణ పట్ల కేంద్రం ఆదినుంచి ఆర్థిక పక్షపాతమే చూపుతున్నది. రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు వివిధరకాల పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతుంటే.. రాష్ర్టానికి రావాల్సిన వాటాను కేంద్రం క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. రాబడులు పెంచుకుంటూ, జనాభా పెరుగుదలపై నియంత్రణ సాధిస్తున్న రాష్ర్టాలను ప్రోత్సహించడానికి బదులు పన్నుల వాటాను తగ్గిస్తున్నది. ఆర్థిక పరిస్థితి బాగాలేని రాష్ర్టాలకు అత్యధిక వెయిటేజీ ఇవ్వడంతో తెలంగాణకు కేంద్ర పన్నుల వాటాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం జరుగుతున్నది. జనాభాను నియంత్రించి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ర్టాలను ప్రోత్సహించకపోతే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలకు కేంద్రం వద్ద సమాధానమే లేదు. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా, అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా ఆర్థికంగా గాడితప్పిన రాష్ర్టాలు కేంద్రపన్నుల వాటాలో అధిక ప్రయోజనం పొందుతుండటం ఎంతవరకు సమంజమని రాష్ర్టాలు మండిపడుతున్నాయి.
అతీగతీలేని స్పెషల్ గ్రాంట్ల ఆమోదం
సంపదను పెంచుకుంటూ తలసరి ఆదాయం పెరుగుతున్న రాష్ర్టాలకు వాటా తగ్గిస్తే ప్రగతికి ప్రతిబంధకమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు కేంద్రానికి వివరించింది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ర్టానికి వెయిటేజీ తగ్గించి శిక్ష వేయడం తగదని స్పష్టం చేయనున్నట్టు తెలిసింది. గతంలో ఆర్థిక క్రమశిక్షణకు 7.5% ఇచ్చిన వెయిటేజీని ఒక్కసారిగా 2.5%కి తగ్గించడం, 1971 జనాభా లెక్కలను కాకుండా 2011 లెక్కల ప్రాతిపదికన వెయిటేజీ ఇవ్వడం వల్ల తెలంగాణకు మరింత అన్యాయం జరుగుతున్నది.
జనాభా తక్కువ ఉండి తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న రాష్ర్టాలకు 15వ ఆర్థిక సంఘం వెయిటేజీ తగ్గించింది. దీంతో కేంద్ర పన్నుల వాటా, గ్రాంట్లలో కోత పడుతున్నది. 2019-20లో రూ.18,964 కోట్లుగా ఉన్న రాబడి ఈసారి 16,241కు తగ్గింది. ఈ లోటును పూడ్చడానికి రూ.723 కోట్ల వరకు స్పెషల్ గ్రాంట్లు ఇవ్వాలని15వ ఆర్థికసంఘం సిఫారసు చేసినా కేంద్రం ఇప్పటివరకు ఆమోదించలేదు. కర్ణాటకకు రూ.5,495 కోట్లు, మిజోరంనకు రూ.546 కోట్ల స్పెషల్ గ్రాంట్లను కూడా ఇవ్వకపోవడం అసాధారణ చర్యగా ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక సంఘం సిఫారసులను సైతం కేంద్రం బేఖాతరు చేసింది. కొవిడ్ రూపంలో ముంచుకొచ్చిన సంక్షుభిత సమయంలో కేంద్రం రాష్ర్టానికి ఉదారంగా ఆర్థికసాయం అందించాల్సి ఉండగా.. ఉన్న నిధులకే కత్తెర వేస్తున్నది. మరోవైపు రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాలో17% వరకు కోత విధించింది.
తక్కువ నష్టపరిహారంలో మనమే..
సెంట్రల్ ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ పన్ను, ఇన్కంట్యాక్స్, జీఎస్టీ, ఐజీఎస్టీ తదితర రూపాల్లో రాష్ట్రం నుంచి కేంద్ర ఖజానాకు అత్యధికంగా కనీసం 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలకు పైగా చేరుతున్నాయి. కానీ ప్రతిగా కేంద్రం నుంచి 25వేల కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ఖజానాకు చేరడం లేదు. జీఎస్టీ అమలైన నాటినుంచి కేంద్రం నుంచి అతి తక్కువ నష్టపరిహారం తీసుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. జీఎస్టీలో రాష్ర్టానికి దక్కాల్సిన వాటాను కూడా దారి మళ్లించిన పరిస్థితులున్నాయి.