హైదరాబాద్ : ఆడపిల్లలు ఉన్న స్థానాలకు ఎదిగి మరో పదిమంది ఆడవాళ్ల ఎదుగుదలకు సాయపడాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ లో గల సోషల్ వెల్ఫేర్ మహిళా కళాశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకేళ్లేది మహిళలే అన్నారు.
మహిళలు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలు జీవితంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారు. ఆత్మవిశ్వాసమే ఆడపిల్లల ప్రధాన ఆయుధం అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దన్నారు. విద్య ద్వారానే ఆత్మ విశ్వాసం పెంపొందుతుందన్నారు. విజయానికి దగ్గరి మార్గం అనేది ఉండదన్నారు. సోషల్ వెల్పేర్ కళాశాలల్లో ఉత్తీర్ణత 90 శాతం ఉండటం హర్షదాయకమన్నారు. మహిళల ఉన్నత విద్య కోసం తెలంగాణలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మహిళలు ఉన్నంతంగా ఎదిగేందుకు రాష్ట్రం వి-హబ్ లాంటివి నిర్వహిస్తోందన్నారు.