హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను వసూలు ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటికే రూ.518 కోట్లు (60 శాతం) వసూలు కాగా, మార్చి ఆఖరు నాటికి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. బకాయిలదారుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సులువుగా పన్ను చెల్లించేలా వాట్సాప్ ద్వారానూ వెసులుబాటు కల్పించారు. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన పట్టణాలు, నగరాల్లో అసెస్మెంట్ అయిన ఆస్తులు 20,22,171ఉన్నాయి. వీటిపై ఈ ఏడాది రూ.538.47కోట్ల ఆస్తిపన్ను వసూలు కావాల్సి ఉన్నది. గతంలో బకాయిలు రూ.230.22 కోట్లు ఉండగా.. వాటిపై రూ.93.15 కోట్లు జరిమానా విధించారు. అన్నీ కలిపి మొత్తం రూ.861.85 కోట్లు వసూలు కావాల్సి ఉన్నది. ఇందులో ఫిబ్రవరి 23 నాటికి రూ.518.68 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.343.16 కోట్లు రావాల్సి ఉన్నది.
ఆస్తిపన్ను వసూళ్లలో వందశాతం లక్ష్యం చేరడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల బకాయిదారుల జాబితాను అధికారులు వెబ్సైట్లో ఉంచారు. ఆస్తిపన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధించి మున్సిపల్ కమిషనర్, పన్ను వసూళ్ల సిబ్బందిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఆస్తిపన్ను చెల్లించడంపై యజమానులకు తెలిసేలా పట్టణాల్లో మైక్లు, బ్యానర్లు, సినీైస్లెడ్స్, ఇతర మార్గాల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. బకాయిదారులకు రోజూ ఎస్ఎంఎస్లు పంపించే విధంగా ఏర్పాట్లుచేశారు. ఎక్కువ మొత్తంలో బకాయిఉన్న టాప్ 500 మంది జాబితాను తయారుచేశారు. 85 శాతం ఆస్తిపన్నును బిల్ కలెక్టర్లు వసూలు చేయాలని, మరో 10 శాతం మొత్తాన్ని సూపర్వైజర్లు, మిగిలిన ఐదు శాతాన్ని మున్సిపల్ కమిషనర్లు వసూలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను వివరాలు, బకాయిలను తెలుసుకునేలా 9000253342 నంబర్ను కూడా ఏర్పాటుచేసింది.
నిర్మల్ పట్టణంలో ఆస్తి పన్ను మొండిబకాయిలు పేరుకుపోతున్నాయి. ఏండ్లకేండ్లు పన్నులు చెల్లించని వందమంది వివరాల జాబితాతో ఫెక్ల్సీని ముద్రించిన మున్సిపల్ అధికారులు గురువారం కార్యాలయ ఆవరణలో ప్రదర్శించారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అత్యధికంగా రూ.8,17,110 పన్ను కట్టాల్సి ఉంది. ఈ వందమంది నుంచి రూ.1,42,97,255 బకాయిలు రావాల్సి ఉన్నట్టు అధికారులు తెలిపారు.