రాజాపేట, మే 21: చారిత్రక వైభవానికి, చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది రాజాపేట కోట. అద్భుత కళా నైపుణ్యంతో రెండున్నర శతాబ్దాల కిందట నిర్మించిన ఈ కోట రాజాపేట గ్రామాన్ని ఆవరించి ఉంటుంది. ఇక్కడి శిల్పకళా సంపద పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎన్నో దండయాత్రలు, గెలుపోటముల గుర్తులను తనలో దాచుకున్నఈ కోట నిజాం నవాబుల కాలంలో ప్రత్యేకంగా నిలిచింది. రాజకీయ శక్తుల సమీకరణ, రాజ్య స్థాపనలో ముఖ్యపాత్ర పోషించిన ఈ కట్టడాన్ని స్థానికులు తెలంగాణ ఎర్రకోటగా పిలుస్తుంటారు. అంతే కాకుండా ఈ కోట గోడను ది గ్రేట్వాల్ ఆఫ్ తెలంగాణ అని కూడా చెప్పుకోవచ్చు.
ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం, పవిత్ర పుణ్య క్షేత్రమైన యాదాద్రికి రాజాపేట కోట 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1775 సంవత్సరంలో రాజరాయన్న రాజు కోటను నిర్మించి.. రాజాపేట గ్రామాన్ని ఏర్పాటు చేశారు. గ్రామం చుట్టూ రాతి గోడను కట్టించారు. శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కోట లోపలి నుంచి సొరంగ మార్గాలు తవ్వించారు. కోట లోపల అతి సుందర భవనాలు, రాణుల అంతఃపురాలు, స్నాన వాటికలు ఉన్నాయి. శత్రుసైన్యం లోపలికి ప్రవేశించకుండా కోట గోడల ముందు పెద్ద కందకం తవ్వించారు. ఎగువ పడమటి వైపు గోపాల చెరువు నుంచి కందకంలోకి నీరు పారించి అందులో మొసళ్లు పెంచేవారు. కోట ముఖద్వారానికి పెద్ద తలుపులు అమర్చారు. మొదటి ముఖద్వారం నుంచి మూడవ ముఖద్వారం వరకు సుదీర్ఘమైన రాచమార్గం ఉన్నది.
అబ్బుర పరిచే కళానైపుణ్యం…
రాజాపేట కోటలో శిల్పకళ సందర్శకులను అబ్బుర పరుస్తుంది. అడుగడుగునా సంస్థానాధీశుల స్మృతి చిహ్నాలు నేటికీ ఈ ప్రాంత ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ప్రధాన దుర్గంలో ప్రతి గడీ ఎంతో సుందరంగా ఉంటుంది. దర్వాజాలు, బాల్కనీలు, బురుజుల నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. అద్దాల మేడ భవనంపైకి చార్మినార్ మాదిరిగా మెట్లు నిర్మించారు. భవనంలోని గదుల్లో శిల్పాలు, సింహాసనాలను పోలిన కుర్చీలు కన్పిస్తాయి.
సీఎం కేసీఆర్ నోట రాజాకోట…
చారిత్రక రాజాకోటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని గతేడాది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ సైతం ప్రస్తావించారు. రాజవంశీయులు సైతం తనను కలిసి పర్యాటక శాఖకు అప్పగిస్తామని సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్పారు. కోటను పునరుద్ధరిస్తే యాదాద్రి, కొలనుపాక, రాజాపేట, గంధమల్ల ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని అసెంబ్లీలో ప్రస్తావించారు. దాంతో అర్కియాలజీ అధికారులు రాజాకోటను పరిశీలించి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు.
కోట నిర్మాణం నిలిపివేత…
రెడ్డి దొర రాజా రాయన్న ముందుగా ఆలేరు ప్రాంతంలోని గుడ్లగూడెం దగ్గర కోట నిర్మాణం ప్రారంభించి అనువైన ప్రాంతం కాదనే ఉద్దేశంతో అర్ధాంతరంగా నిలిపేశాడట. కోట నిర్మాణాకి సరైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ ఇప్పుడున్న ప్రాంతంలో కోటతో పాటు నగరాన్ని నిర్మించాడు. నాడు రాయన్నపేట పేరొందిన ఈ ప్రాంతం కాల క్రమంలో రాజాపేటగా మారింది.
రాజాకోట పాలన… చరిత్ర…
గతంలో సంస్థాన్ నారాయణపురం, సంస్థాన్ రాజాపేటను ప్రధాన కేంద్రాలుగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక్కడ సంస్థానాధీశుల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రభుత్వ భూములను కౌలుకు ఇచ్చి సేద్యం చేయించేవారని, రాజరాయన్న అనంతరం రాజా వెదిర వెంకటనారాయణరావు బహుదూర్ రాజ్యాధికారాన్ని చేపట్టినట్టు తెలుస్తున్నది. వెంకట నారాయణరావు సతీమణి జానకమ్మ నాడు దేవాలయాలు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేపట్టడంతో పాటు కొంత మందికి భూమిని సైతం దానం చేసినట్లు సమాచారం. రాజా వెదిర వెంకటనారాయణరావు బహుదూర్ అనంతరం పాలకుడైన రాజా జశ్వంత్రావు కుటుంబం హైదరాబాద్లో స్థిరపడినట్లు తెలుస్తున్నది.
కోటపై రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం..
రాజాపేట కోటలో స్వరాష్ట్రంలో తొలి గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణలోని చారిత్రక, పురాతన కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలని సీఎం కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగుర వేయగా ఆదే స్ఫూర్తితో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి రాజాపేట కోటపై జెండా ఎగురవేశారు. నాటి నుంచి ఏటా ఇక్కడ గణతంత్ర వేడుకలు నిర్వహిస్తూ జెండాను ఆవిష్కరిస్తున్నారు.
మరింత బాగుండేది..
నా చిన్నతనంలో రాజాపేట కోట ఎంతో బాగుండేది. రక్షణ లేకపోవడంతో గోడలు, దర్వాజాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చారిత్రాత్మక కట్టడాన్ని పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది వెలుగులోకి తీసుకురావాలి.
– పుల్లంగారి సిద్ధయ్య, రాజాపేట